సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఒక్కసారిగా షాకిచ్చింది. ప్లాట్ఫామ్ టిక్కెట్ ధరను 10 రూపాయల నుంచి ఏకంగా 50 రూపాయలకు పెంచింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ ధరలను తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చింది. పెరిగిన ప్లాట్ఫాం ధరలు మార్చి ఒకటోతేదీ అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని సెంట్రల్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శివాజీ సుతార్ తెలిపారు. పెరిగిన ధరలు జూన్ 15 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని శివాజీ వెల్లడించారు.
ముంబయి మహానగరంతోపాటు పాటు మహారాష్ట్రలోని పలు నగరాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఆయా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ముఖ్యమైన పండగల సమయంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించడానికి ప్లాట్ఫాం టికెట్ ధరలను రెట్టింపు చేస్తారు. కానీ, ఈసారి ఏకంగా ఐదు రెట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్ స్టేషన్, లోకమాన్య తిలక్ టెర్మినస్తో పాటు థానే, కళ్యాణ్, పన్వేల్, భివాండీ రైల్వే స్టేషన్లలో ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. వేసవి కాలంలో సాధారణంగా రైల్వే స్టేషన్లలో రద్దీ పెరుగుతుందని.. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించడానికి ప్లాట్ఫాం టికెట్ ధరలను పెంచినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి ముంబయిలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇప్పటివరకు 3.25 లక్షలకు పైగా కేసులు నమోదవగా 11,400 మంది మరణించారు.