ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతీ ఒక్క విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కీలక అంశాల్లో విపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు; టీడీపీ గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జగన్ ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్ మొదటి సమావేశంలోనే తొలి తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆస్తి పన్ను పెరగడం వల్ల ఇంటి అద్దెలు పెరిగి మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని ఆయన ఆరోపించారు. రిజిస్టర్ విలువ ఆధారంగా పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటాం అని ఆయన స్పష్టం చేసారు. జగన్ కు ఓటేస్తే ప్రజలపై భారం పడుతుంది  అని ఆయన అన్నారు. ఇసుక, సిమెంట్, గ్యాస్, డీజల్, పెట్రోల్, వంట నూనెల ధరలు పెరుగదలతో సామాన్యులపై భారం పడిందని చంద్రబాబు అన్నారు. కష్టకాలంలో పోరాడితేనే నాయకులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందని సూచించారు.

వైసీపీ బెదిరింపులకు భయపడి నామినేషన్లు వెనక్కు తీసుకోవడం పిరికిచర్య అని ఆయన మండిపడ్డారు. గురువారం నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా అని స్పష్టం చేసారు. మద్యం సీసాలు వాళ్లే తెచ్చిపెట్టి టీడీపీ వారిపైనే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడరు అని అన్నారు.  ఇలాంటి వాటి పట్ల నాయకులు జాగ్రత్త పడాలి అని ఆయన సూచించారు. ధైర్యంగా పోరాడాలి.. ఏదైనా ఘటన జరిగితే నేను కూడా వచ్చి పోరాడతా అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇళ్లూ తిరిగి ప్రభుత్వ దుర్మార్గ పాలనను  ప్రజలకు వివరించాలన్నారు. టీడీపీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: