వాలంటీర్ల పై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై విచారణ ముగియగా తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీకి ఇబ్బంది లేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. రాజకీయ పక్షాలనుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే చర్యలు తీసుకున్నామని ఎస్ఈసీ న్యాయవాది హైకోర్ట్ లో తన వాదనలను వినిపించారు. లబ్దిదారులతో నేరుగా టచ్లోకి వెళ్లి బెదిరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయని ఎస్ ఈ సీ న్యాయవాది హైకోర్ట్ కి వివరించారు.
రాజకీయ పక్షాల నుంచి 600 ఫిర్యాదులు వచ్చాయని హైకోర్టు దృష్టికి ఎస్ఈసీ వివరించింది. లబ్దిదారులను అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని వాలంటీర్లు బెదిరిస్తున్నారని తెలిపిన పిటీషనర్ల తరపు న్యాయవాది... స్ధానిక నేతలు వాలంటీర్లను ప్రభావితం చేసి అధికార పార్టీకి అనుకూలంగా మలచుకుంటున్నారని వాదనలు వినిపించారు. పోలింగ్ సందర్భంగా ఓటర్ స్లిప్పుల పంపిణీలో కూడా వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారు అని ఆరోపించారు. అధికార పార్టీ అనుచరులకు స్లిప్పులు ఇచ్చి, ప్రత్యర్ధి వర్గాలకు స్లిప్పులు ఇవ్వటం లేదు అని వివరించారు. అందువలనే వాలంటీర్ల జోక్యాన్ని ఎన్నికల ప్రక్రియలో నివారించాలని పిటీషనర్ లు కోరారు. వాదనలు ముగియటంతో ఉత్తర్వులను రిజర్వ్లో ఉంచింది రాష్ట్ర హైకోర్ట్.