మూఢనమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. టెక్నాలజీ పెరిగినా ఇప్పటివరకూ కొందరూ మూఢ నమ్మకాల్లోనే బతికేస్తున్నారు. ఇంట్లో చెడు జరుగుతోందని, ఏదీ కలిసి రావడం లేదని తాంత్రికులను ఆశ్రయిస్తున్నారు. వారి అనుమానాలు, ఆశలు, గుడ్డి నమ్మకంతో తాంత్రికులు చెప్పిన మాటలు విని ప్రాణాలు తీసేంతవరకు పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. క్షుద్ర పూజలతో ఓ మహిళను మెట్టినింటి వాళ్లు అతి దారుణంగా హింసించి చంపారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలోని పొవాయన్ తాలుకాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పిలిభిత్ ప్రాంతంలోని బిల్సాండా గ్రామానికి చెందిన శారదాకు 13 ఏళ్ల కింద వివాహం జరిగింది. భర్త పేరు సర్వేశ్.. పెళ్లై ఇన్ని సంవత్సరాలు అయినా శారదాకు పిల్లలు పుట్టలేదు. దీంతో అత్తింటి వేధింపులు పెరిగిపోయాయి. శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టారు. సర్వేశ్ తల్లిదండ్రులు తమ కొడుకుకి రెండో పెళ్లి చేయించడానికి కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సంతానం కోసం ఓ తాంత్రికుడిని ఆశ్రయించారు. అతడు చెప్పినట్లు పూజలు చేస్తే శారదకు పిల్లలు పుడతారని చెప్పడంతో.. ఆమెను తీవ్రంగా హింసించడం మొదలు పెట్టారు.

తాంత్రిక పూజా సమయంలో ఆ తాంత్రికుడు శారద శరీరంపై, మర్మాంగాల్లో వేడిగా కాల్చిన ఇనుప రాడుతో వాతలు పెట్టాడు. ఈ హింస భరించలేక శారద మృతి చెందింది. అయితే ఒక రోజు శారద అత్తింటివారు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. శారద చనిపోయిందనే విషయాన్ని చెప్పారు. దీంతో శారద కుటుంబ సభ్యులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. వారు వచ్చేసరికి శారద మృతదేహాం రక్తపు మడుగులో కనిపించింది. దీంతో శారదా సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉందని.. దర్యాప్తు చేపట్టి నిందితులను కఠినంగా శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: