ఏపీలోని పట్టణాలు, నగరాల్లో ఏప్రిల్ 1 నుంచి రిజిస్టర్డ్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను భారీగా పెంచేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రలను అడ్డుకుంటామని అన్నారు చంద్రబాబు. పురపాలక ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే ప్రజలపై పెనుభారం పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేస్తుండగా, రిజిస్ట్రేషన్ విలువ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను పెరిగేలా జగన్ చట్టం తీసుకొచ్చారని విమర్శించారు బాబు. రాష్ట్ర ప్రభుత్వం రుణ పరిమితి పెంచుకోవడానికి ప్రజలపై భారం వేయడం సిగ్గుచేటని అన్నారాయన. గతంలో పన్ను వేయని భవనాలు, ఖాళీ స్థలాలకు కొత్త విధానంలో రిజిస్టర్డ్ విలువ ఆధారంగా పన్ను వేసేలా వైసీపీ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందని విమర్శించారు చంద్రబాబు. పేద, మధ్యతరగతి ప్రజలు కూడా రిజిస్టర్డ్ విలువ ఆధారంగా పన్ను చెల్లించేలా చట్టం తేవడం ప్రజలను వేధించడమేనని అన్నారు చంద్రబాబు.
ఆస్తి పన్ను పెంపుతో ప్రజలపై వైసీపీ ప్రభుత్వం ఎక్కడలేని భారం మోపుతోందని అన్న చంద్రబాబు.. తమ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. తొలి కౌన్సిల్ లోనే ఆస్తి పన్ను తగ్గించేలా తీర్మానం చేపడతామన్నారు. ఇక పురపోరుకోసం ప్రచార రంగంలోకి దిగిన బాబు, ఈ నెల 4న కర్నూలు, 5న చిత్తూరు, 6న విశాఖ, 7న విజయవాడ, ఎనిమిదో తేదీన గుంటూరులో పర్యటించబోతున్నారు. టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ రోడ్ షో లలో పాల్గొంటారు.