ప్రకాశం జిల్లా కనిగిరిలో 20వార్డులకుగాను 11 వార్డులను ఏకగ్రీవం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమైన నేతలు దగ్గరుండి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను లోబర్చుకునే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఈ విషయంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి పూర్తిగా సహకరిస్తోందనే విమర్శలున్నాయి. అటు డీఎస్పీ, ఇటు సీఐలు తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులను భయపెట్టడంలో కీలకభూమిక పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు డివిజన్లను వైసీపీ ఏకగ్రీవంగా హస్తగతం చేసుకోగా అందులో మూడుచోట్ల రంగంలో ఉన్న టీడీపీ అభ్యర్థులను మచ్చిక చేసుకోవటం, నామినేషన్ల పరిశీలనకే రాకుండా చేసి డివిజన్లను సొంతం చే సుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పుకుంటే వారికి రూ.20 లక్షలు అందజేసే ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఎవరి మాటా వినని చీరాల నేతలు
ప్రకాశం జిల్లా చీరాలలో కరణం బలరాం, ఆమంచి కృష్ణమోమన్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. వీరి ఆధిపత్య పోరును ఆపడానికి వైసీపీ అధిష్టానం పురపాలక ఎన్నికల ప్రక్రియను చివరకు తనచేతిలోకే తీసుకుంది. మంత్రి బాలినేని ఒంగోలులోని తన నివాసంలో ఇటు బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్, అటు ఆమంచితో విడివిడిగా భేటీ అయ్యారు. భవిష్యత్తులో పర్చూరు బాధ్యతలతో పాటు ఎమ్మెల్సీ పదవిని పొందనున్న ఆమంచికి సర్దుకుపోవాలని బాలినేని సూచించారు. అలాగే ఆమంచి అనుచరుల విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని బలరాంకు సూచించారు. సీఎం ఆదేశానికి అనుగుణంగా పార్టీ బీఫారాలను పరిశీలకులకు ఇస్తానని, వారు ఏ అభ్యర్థికి ఇస్తే వారే పార్టీ అభ్యర్థి అవుతారని ప్రకటించారు.