ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వేడి పెంచుతున్నాయి. నామినేషన్ల ఉప సంహరణలో అధికార వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్థులను బెదిరించి.. విత్ డ్రా కోసం ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తిరుపతి కార్పొరేషన్‌లోని 45వ డివిజన్ లో మంగళవారం రాత్రి గొడవ జరిగింది. వైసీపీ, టీడీపీ  వర్గాలు దాడులకు పాల్పడ్డాయి. ఒకరిపై ఒకరు ముష్టి ఘాతాలకు దిగారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త రెండు పళ్లు ఊడిపోయాయి. 45వ వార్డులో టీడీపీ నుంచి చంద్రమోహన్ అనే వ్యక్తి  నామినేషన్ దాఖలు చేశారు. లోకేశ్ నాయుడు  ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. సాయంత్రం చంద్రమోహన్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అయితే చంద్రమోహన్ అభ్యర్థిత్వాన్ని తాను ప్రతిపాదించడంతో రగిలిపోయిన వైసీపీ కార్యకర్తలు తనపై దాడిచేశారని లోకేశ్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రాత్రి పది గంటల సమయంలో పార్కు పక్కన ఉన్న తన దుకాణంపై వైసీపీ కార్యకర్తలు కొందరు దాడిచేసి ధ్వంసం చేశారని, పారిపోయేందుకు ప్రయత్నించిన తనను పట్టుకుని తీవ్రంగా కొట్టారని, దీంతో తన పళ్లు రెండు ఊడిపోయాయని పోలీసులకు  ఇచ్చిన ఫిర్యాదులో లోకేశ్ నాయుడు ఆరోపించారు. ఊడిపోయిన పళ్లను అలిపిరి పోలీసులకు చూపించారు.

 నామినేషన్ ఉప సంహరణ కోసం  వార్డు కార్యాలయంలో తనపై ఒత్తిడి తెచ్చినట్టు లోకేశ్ నాయుడు చెబుతున్న 47వ వార్డు టౌన్ ప్లానింగ్ కార్యదర్శి సురేంద్ర కనిపించడం లేదని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తిరుపతిలో గొడవ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికను వైసీపీ, టీడీపీ సవాల్ గా తీసుకున్నాయి. చంద్రబాబు కూడా ఫోకస్ చేయడంతో రాజకీయ వేడి పెరిగింది. అయితే తిరుపతిలో విజయం సాధించి.. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో అనుకూలంగా మలుచుకోవాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తోంది. అందుకే కార్పొరేషన్ లో క్లీన్ స్వీప్ చేసే దిశగా పావులు కదుపుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: