కామారెడ్డి జిల్లాలో ఓ కీచక ప్రధానోపాధ్యాయుడి వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ తరగతుల పేరుతో విద్యార్థినులకు వీడియో కాల్ చేస్తున్న ఆ ప్రధానోపాధ్యాయుడు.. దుస్తులు విప్పి అందాలు చూపించాలని వారిని వేధిస్తున్నాడు. గతంలో డ్యాన్స్ క్లాసుల పేరుతో అతను విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పాఠశాల విద్యార్థినులు చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయుడి వేధింపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థినులు పాఠశాల ఎదుట నిరసనకు దిగడంతో ఉన్నతాధికారులు దిగివచ్చారు.
కామారెడ్డి జిల్లా నల్లమడుగు తండాకు చెందిన రాము కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కారణం లేకుండా రాముకి టీసీ ఇచ్చి పంపించారు. దీంతో మనస్తాపం చెందిన రాము ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అదే పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఆ కీచక టీచర్ వేధింపులను బయటపెట్టారు. కరోనా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఆన్లైన్ తరగతుల పేరుతో తమను వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. పాఠౄలు చెప్పేందుకు వీడియో కాల్ చేసి... అందాలు చూపించాలని వేధించేవాడని వాపోయారు. గతంలోనూ డ్యాన్సు క్లాసుల పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా డ్యాన్స్ నేర్పిస్తానని గదిలోకి తీసుకెళ్లి వేధించేవాడని విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపించి అతనిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.