కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి అంటారు - ఏ సంపాదన లేకుండా ఏ సంపద కొత్తగా చేరకుండా ఖర్చులు చేసుకుంటూ పొతే - చివరకు చేతికి చిప్పే. ఏ వ్యవస్థయినా చివరికి కుటుంబమైనా దివాళాకు దారి తీయటం తధ్యం. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అలా అయిపొతుందెమో! అంటున్నారు ఆర్థికవేత్తలు. రాష్ట్రంలో అంతా ఉచితమే. మీరు మందు కొడుతూ సంతానోత్పత్తి చేయండి. మాకు ఓట్లేయండి మేము మిమ్మల్ని పోషిస్తాం అంటున్న తీరున ప్రభుత్వం నడుస్తుంది. చివరకు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి చౌకధరల దుకాణానికి కూడా వెళ్ళక్కర లేదు. వాటిని మీ ఇంటికి డెలివరీ చేస్తాం. పెన్షన్లు కూడా నెలనెల ఇంటికొచ్చి మా వాలంటీర్లు అందజేస్తారు. ఇంకేం రాష్ట్రానికి వండి వార్చి నోటి కందించే ప్రభుత్వం వచ్చింది. ప్రజలని సోమరి పోతులు తాగుబోతులుగా మార్చేస్తుంది.


ఎలాంటి సందేహమూ లేకుండా చెప్పొచ్చు! సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మొట్టమొదటి స్థానంలోఉంది ఆంధ్రప్రదేశ్‌. అందులో లేదు. వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల కోసం సీఎం జగన్‌ మోహన రెడ్డి కొత్త కొత్త సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఆలోచిస్తున్నారు.



ఇంతవరకు బాగానే ఉన్నా, తాజాగా వెల్లడైన నివేదికలు ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ పై బెంగ పుట్టిస్తున్నాయి. అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లు గా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళుతుంది. దీంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. తాజాగా, కాగ్‌ నివేదికలు ఆ అప్పుల లెక్కలను బహిర్గతం చేశాయి.


2020 ఏప్రిల్ నుంచి, 2021 జ‌న‌వ‌రి నెలాఖ‌రు వ‌ర‌కు అంటే ప‌ది నెల‌ల కాలానికి సంబంధించి కాగ్ త‌న నివేదిక‌ను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఏపీ ఈ ప‌ది నెల‌ల కాలంలో ఏకంగా ₹ 73,912 కోట్ల అప్పు చేసింది. దేశం లోనే అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డుల‌ కెక్కింది.

మ‌న కంటే సంక్షేమ ప‌థ‌కాలు ఎక్కువ‌గా అమ‌లు చేస్తున్న రాష్ట్రాలు సైతం ఈ స్థాయిలో అప్పులు చేసిన దాఖ‌లాలు లేవు. ఈ అప్పు కాకుండా ఆర్‌బీఐ నుంచి తాత్కాలిక రుణాల కింద దాదాపు ₹5000 కోట్లు అప్పు చేయ‌డం గ‌మనార్హం.

కాగ్ తాజా నివేదిక ప్రకారం ప‌లు రాష్ట్రాల అప్పుల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే, దేశం లోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తప్రదేశ్‌ అప్పు ₹28,653 కోట్లు, మ‌హారాష్ట్ర అప్పు₹31,670 కోట్లు, త‌మిళ‌నాడు అప్పు ₹49,844 కోట్లు, క‌ర్నాట‌క అప్పు₹30,229 కోట్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రమైన తెలంగాణ అప్పు ₹43,937.95 కోట్లు, పంజాబ్ ప‌ది నెల‌ల కాలంలో చేసిన అప్పు కేవ‌లం ₹9,928 కోట్లు మాత్రమే. తెలంగాణ‌లో ఏడాదికి ప్రతి ఎక‌రాకు ₹10000/- చొప్పున ఎంత భూమి ఉంటే అంత సొమ్ము కేసీఆర్ ప్రభుత్వం అంద‌ జేస్తోంది.

ఏపీ చేసిన అప్పు ఓ ప‌ది చిన్న రాష్ట్రాల అప్పుతో స‌మానంగా ఉన్నట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక రాష్ట్ర ఆదాయానికి సంబంధించి కాగ్ వెల్లడించిన వివ‌రాల‌ను పరిశీలిస్తే, ప్రతినెలా ఒక‌టో తేదీనే పింఛ‌న్ల పంపిణీకి విప‌రీత‌మైన ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం, అదే ప్రాధాన్యత రాష్ట్ర ఆదాయ వ‌న‌రుల‌ను పెంచుకోవ‌డంలో చూప‌క‌పోవ‌డం తీవ్ర న‌ష్టాల‌ను తీసుకొస్తోంది.

ప్రధానంగా రాష్ట్రానికి మూడు మార్గాల్లో ఆదాయం వ‌స్తుంది. అమ్మకాల పై వచ్చే - జీఎస్టీ, వ‌స్తుసేవ‌ల ద్వారా వ‌చ్చే ఆదాయం 56.82 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. ఇక మిగిలింది కేవ‌లం రెండు నెల‌ల స‌మ‌యం మాత్రమే. భూముల అమ్మకం స్టాంప్స్‌- రిజిస్ట్రేష‌న్స్ ద్వారా ప‌ది నెల‌ల కాలంలో 67.47 శాతం ఆదాయాన్ని పొంద‌గ‌లిగింది. ఇంకా 33 శాతం ఆదాయాన్ని రెండు నెల‌ల్లో సాధించాల్సి ఉంది. పెట్రోల్‌, డీజిల్ అమ్మకాల ద్వారా 53.36 శాతం మాత్రమే ఏపీ గ‌వ‌ర్నమెంట్ సాధించ గలిగింది

ఒక వైపు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, ఆదాయాన్ని మాత్రం పెంచుకోలేక‌ పోతుండ‌డం ఆశ్చర్యం క‌లిగిస్తోంది. ఇక మిగిలిన రెండు నెల‌ల కాలంలో 46.64 శాతం ఆదాయాన్ని ఏ ర‌కంగా పెంచుకుంటుందో తెలియకుండా ఉంది.

అయితే, జగన్‌ అధికారంలోకి వచ్చే ముందు మ‌ద్యపాన నిషేధం అన్నాడు కానీ ఇప్పుడు దాన్నే ఇప్పుడు ప్రోత్సహించాల్సి వస్తోంది. మ‌ద్యపాన విక్రయాల ద్వారా ఆర్జించిన ఆదాయం లక్ష్యానికి మించి ఇప్పటికే 14 శాతం రాష్ట్ర ప్రభుత్వం స‌మ‌కూర్చు కోవ‌డం గ‌మ‌నార్హం. ఇంకా రెండు నెల‌ల కాలంలో మ‌రింత‌గా ఆదాయాన్ని మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పొంద‌నుంది.

ఇదిలా ఉండ‌గా కేంద్రం నుంచి రాష్ట్రానికి ప‌న్నుల వాటా కింద రావాల్సిన సొమ్ము గురించి కూడా కాగ్ నివేదిక బ‌య‌ట పెట్టింది. ప‌ది నెల‌ల కాలంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹22,506 కోట్లు రావాల్సి ఉంది. కానీ, ఇంత వ‌ర‌కూ కేంద్రం నుంచి వ‌చ్చిన సొమ్ము ₹11,313.96 కోట్లు మాత్రమే. ఇంకా రావాల్సిన మొత్తం ₹11,192.04 కోట్లు. కేంద్రం నుంచి హ‌క్కుగా పొందాల్సిన ప‌న్నుల వాటాలో స‌గం మాత్రమే ఏపీకి రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

కేంద్రాన్ని ప్రశ్నించే, నిల‌దీసే ద‌మ్ము, ధైర్యం లేక‌పోవ‌డం వ‌ల్లే ఏపీ ప్రయోజ‌నాల విష‌యంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తోంద‌నే విమ‌ర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మేల్కొని ఖర్చులు పెట్టేముందే ఆదాయం పై దృష్టి పెడితే బాగుంటుందని ఆర్ధిక విశ్లేషకులు రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: