జగన్ సర్కార్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం రూ. 6.75 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారుల సలహా మేరకు ప్రస్తుతం 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.75 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నతాధికారుల వినియోగంలోకి రానున్న మొత్తం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ఐదు మహీంద్రా స్కార్పియోలు మిగిలిన ఐదు టాటా హెక్సా వాహనాలున్నాయి. ఇందులో ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో కోసం 65 లక్షలరూపాయలు, ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ టాటా హెక్సా కోసం రూ. 70 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు వినియోగంలో ఉన్న వాహనాలతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రులు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. అంతే కాకుండా పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తలెత్తిన ఇబ్బందుల కారణంగా ఓ మంత్రి అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఇప్పటికే మంత్రుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఉన్నతాధికారుల సలహాతో ప్రస్తుతమున్న పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను భర్తీ చేయడానికి రాష్ట్రప్రభుత్వం సుముఖత చూపింది. కొత్తగా రానున్న ఈ 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి, కొంతమంది మంత్రులకు పోలీస్ శాఖలోని కొంతమంది ఉన్నతాధికారుల రక్షణకు ఉపయోగించనున్నారు.