మున్సిపాల్టీలోని మొత్తం 38 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులకు ధీటుగా టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలోనే తిష్ఠవేయడంతో అధికార వైసీపీ ఎత్తులు పారడం లేదు. నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికలను బాలయ్య పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మొత్తం 38 పంచాయతీలకు గాను వైసీపీ ఏకంగా 30 పంచాయతీలను గెలుచుకుంది. దీంతో మునిసిపల్ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చాటుకోవాలని బాలయ్య స్వయంగా పురంలో మకాం వేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది.
ఇందుకోసం బాలయ్య ముందు నుంచే పక్కా ప్లానింగ్తో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆరు రోజుల ముందే తన ప్రతినిధులైన శ్రీనివాసరావు, సురేంద్రనాథ్లను హిందూపురంలో మకాం వేయించారు. షూటింగ్ల లో ఆయన ఎంత బిజీగా ఉన్నా స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ వారికి సలహాలు .. సూచనలు చేశారు. అభ్యర్థులెవరూ విత్డ్రా చేసుకోకుండా స్థానిక నేతలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఏదేమైనా అధికార పార్టీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలయ్య మొత్తం 38 వార్డుల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టడంతో పాటు అక్కడ గట్టి పోటీ ఇస్తున్నారు.