విద్యార్థుల్లో కొందరు జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. అయితే ఫలితాల అనంతరమే వ్యాధి నిర్ధారణ అవుతుందని చెబుతున్నారు. పాఠశాలలో మహమ్మారి వ్యాప్తి చెందడానికి కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అటు తల్లిదండ్రులు కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా భయంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే.. వికారాబాద్ ఎమ్మెల్యే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మైనారిటీ స్కూల్ లో స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులతో ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థి వాణీదేవికి ఓటేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఎమ్మెల్యే సుమారు గంటసేపు పాఠశాలలో సమవేశమయ్యారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు పాజిటివ్ రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు సైతం కోవిడ్ పరీక్షలు నిర్వహించబోతున్నారు.
స్కూల్ పిల్లలకు కరోనా రావడంతో.. జిల్లాలోని ఇతర స్కూళ్లలో కూడా ఉపాధ్యాయుల్ని అప్రమత్తం చేశారు అధికారులు. కరోనా నియంత్రణలో భాగంగా అందరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. శానిటైజర్లు వాడాలని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ మొదలైందన్న వార్తల నేపథ్యంలో స్కూల్ పిల్లలతో సహా.. అందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు.