తెలంగాణ సర్కారు, స్కూల్స్ రీఓపెనింగ్ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించింది. మిగతా రాష్ట్రాలకంటే ఆలస్యంగా స్కూళ్లు తెరిచింది. అయితే ప్రభుత్వం అనుమానించినట్టుగానే ఇప్పుడు కరోనా మహమ్మారి విద్యార్థులను భయపెడుతోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డి సమీపంలో ఉన్న మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా‌ సోకింది. ఈమేరకు వైద్యాధికారులు నిర్ధారించారు. ఈ పాఠశాలలో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది మొత్తం 40 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురికి కోవిడ్‌ పాజిటివ్ గా తేలింది. విద్యార్థుల్లోనూ కొందరికి వైరస్‌ లక్షణాలు ఉన్నాయని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 100 మంది విద్యార్థులనుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌ కు తరలించారు.

విద్యార్థుల్లో కొందరు జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. అయితే ఫలితాల అనంతరమే వ్యాధి నిర్ధారణ అవుతుందని చెబుతున్నారు. పాఠశాలలో మహమ్మారి వ్యాప్తి చెందడానికి కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అటు తల్లిదండ్రులు కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా భయంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  

ఇదిలా ఉంటే.. వికారాబాద్‌ ఎమ్మెల్యే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మైనారిటీ స్కూల్‌ లో స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులతో ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థి వాణీదేవికి ఓటేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఎమ్మెల్యే సుమారు గంటసేపు పాఠశాలలో సమవేశమయ్యారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు పాజిటివ్‌ రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు సైతం కోవిడ్‌ పరీక్షలు నిర్వహించబోతున్నారు.

స్కూల్ పిల్లలకు కరోనా రావడంతో.. జిల్లాలోని ఇతర స్కూళ్లలో కూడా ఉపాధ్యాయుల్ని అప్రమత్తం చేశారు అధికారులు. కరోనా నియంత్రణలో భాగంగా అందరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. శానిటైజర్లు వాడాలని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ మొదలైందన్న వార్తల నేపథ్యంలో స్కూల్ పిల్లలతో సహా.. అందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: