మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఒక్కసారి చూస్తే... మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూ ఆర్ కోడ్ తో 2000 స్టాండ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళా భద్రత, సాధికారితపై షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రతి వింగ్ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చెయ్యాలని నిర్ణయించారు. పోలీసు డిపార్ట్మెంటులో పనిచేస్తున్న మహిళలందరికీ ఆ రోజు స్పెషల్ డే ఆఫ్ గా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అంగన్ వాడీ ఉద్యోగులందరికీ ఏటా హెల్త్ చెకప్ ఉంటుందని స్పష్టం చేసారు. అదనంగా మహిళా ఉద్యోగులకు 5 క్యాజువల్ లీవ్స్ ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు అని అధికారులు పేర్కొన్నారు. నాన్ గెజిటెడ్ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ కాలేజీల నుంచి పైస్థాయి కాలేజీల వరకు దిశపై ప్రచారం నిర్వహిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అందులో దిశ యాప్ సహా అన్నిరకాల వివరాలు ఉంచాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.