రైతుల ఆందోళనలో పాల్గొన్న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మహిళా రైతుల అనుభవాలు, అనుభూతులతో పాటుగా, రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన విశేషాలను ఫోటోలో ప్రతిబించేలా ఉంది. మన దేశంలో మహిళలు లింగ వివక్ష, లైంగిక హింస, అత్యాచారాలు,పితృస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాల గురించి కూడా పత్రిక ప్రస్తావించిందిట. అయితే పత్రిక ప్రచురించిన కథనంలో ఇంకా ఏయే అంశాలు ఉన్నాయో పూర్తిగా తెలియదు. పత్రిక మార్కెట్ లోకి వస్తేనే కానీ ‘టైమ్స్ మ్యాగజైన్’ ఏ ఉద్దేశంతో ఈ కథనం ప్రచురించిందో తెలియదు.
గత నాలుగు నెలలకు పైగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో సాగుతున్న రైతుల ఆందోళన ఇప్పటికే అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియా సపోర్ట్ సంపాదించింది. రైతుల ఆందోళన వివాదంగా కూడా మారింది. కోర్టులు,కేసులు, అరెస్టులు విచారణలు సాగుతున్నాయి. ఇప్పుడు టైమ్స్ మ్యాగజిన్ పై కవర్ పేజీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే క్రమంగా చల్లారుతున్న రైతు ఉద్యమాన్ని మళ్ళీ రగిల్చేందుకు మళ్లీ కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని, ‘కిసాన్ మహిళా దివస్’ గా నిర్వహించాలని ఆందోళనకారులు నిర్ణయించారు.