ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న ద్యార్థినులకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన న్యాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీచేశారు. బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ఉచిత శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ పథకం ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, మంచి కంపెనీలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినిలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా చూడాలన్నారు.
జులై 1 నుంచి ప్రతి నెలా ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ కార్యక్రమం జరగనుంది. నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్కిన్స్ ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. సుమారు రూ. 41.4 కోట్ల ఖర్చు చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్ల ద్వారా తక్కువ ధరకే బ్రాండెడ్ కంపెనీల శానిటరీ న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచనున్నారు. దీని కోసం న్యాప్కిన్స్ తయారీలో అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్ ఎంవోయూ ఏకం కానున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తీసుకుంటున్న చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సమగ్రమైన నివేదిక రూపొందించినట్లు చెప్పారు. విద్యార్థినిలకు పోటీపరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందించాలని, ఇందుకు ల్యాప్టాప్లను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.