ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడు అడుగులు వేశాడు.. చేతిలో చేయి వేసి ప్రామాణాలు చేశాడు. మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చాడు. భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిందిపోయి అనుమానం పెంచుకున్నాడు. ఇతరులు వేధిస్తున్నారని వారి బారి నుంచి కాపాడాలని భర్తను వేడుకుంటే వారితో ఏదో సంబంధం ఉందని అనుమానించి భర్తే కడతేర్చాడు. హత్య నుంచి తప్పించుకునేందుకు వేరొకరిపై నేరం మోపి వారిపై దాడికి వెళ్లాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

అనుమానం పెద్ద జబ్బుగా మారి కాపురాలను కూల్చేస్తోంది. ప్రేమ పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. అయితే విడాకులు తీసుకున్న తరువాత కూడా చాలామంది ఎవరి జీవితం వారు బతుకున్నారు.. కానీ అనుమానం పెనుభూతమై భార్యనే హత్య చేసే భర్తలను ఏమనాలి.. అది కూడా ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన తరువాత అత్యంత కిరాతాకానికి ఒడిగట్టాడు ఓ భర్త.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరి మండలం నెత్తంకండ్రిగకు చెందిన భానుప్రియను నారాయణమూర్తి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు మహీధర్‌(6), బాబి(4) అనే ఇద్దరు సంతానం. అయితే స్థానికంగా ఉండే టీచర్ గోపీ, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ధనశేఖర్ భానుప్రియను వేధింపులకు గురి చేసేవారు. దీంతో అనుమానం పెంచుకున్న భర్త నారాయణమూర్తి ఆమెను వేధింపులకు గురి చేసేవాడు. వేధింపులపై 3రోజుల క్రితం భానుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఆగ్రహించిన నారాయణమూర్తి భార్యతో బలవంతంగా సూసైడ్‌ నోట్‌ రాయించి, ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ధనశేఖర్‌ ఇంటిపై బంధువులతో కలిసి దాడి చేసి తగులబెట్టేశాడు. పోలీసులు నారాయణ మూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టైంది. దీంతో నిందితుడు నారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే భానుప్రియను వేధించిన గోపి, ధనశేఖర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఏపీఎస్పీ కానిస్టేబుల్ ధనశేఖర్‌ ఇంటిపై దాడి చేసినందుకు నారాయణమూర్తి, అతడి బంధువులపైనా మరో కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: