ఏపీ 09 బిటి 5089 అనే నెంబర్ బైక్ మీద మొత్తం 87 చలానాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ చలానాల విలువ రూ.20,400గా ఉన్నది. దీంతో పోలీసులు ఆ బైక్ ను సీజ్ చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘన సర్వ సాధారణ అంశంగా మారింది. వాహనదారులు మారడం లేదు. భయం... బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనా నిబంధనలు దాదాపు పాటించడంలేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదు. ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నారు. యువత ట్రిపుల్ రైడింగ్తో రయ్...రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. భౌతిక దూరాన్ని ఎవరూ పాటించడంలేదు.
దాదాపు ఎక్కడ కూడా లాక్డౌన్ నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించడంలేదు. రాత్రి సమయంలో ఉన్న కర్ఫ్యూ నిబంధనలు పాటించకుండా బందోబస్తులో ఉన్న పోలీసులను పరేషాన్ చేస్తున్నారు. అంతేకాదు.. కొంతమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతరులు పాన్, గుట్కాలను యథావిధిగా తిని రోడ్లపై ఉమ్మి వేస్తున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినం చేశారు పోలీసులు. ఇకపై ఎలా పడితే అలా బండి నడిపితే కదరదు. హైదరాబాద్ పోలీసులు కొత్త ట్రాఫిక్ రూల్స్ను అమలులోకి తెచ్చారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెండ్ చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్.. సిగ్నల్ జంపింగ్కు ఈ నిబంధనలు వర్తిస్తాయి.