ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ ప్రధాన రహదారిపై తనకున్న 27 గుంటల భూమిలో దుకాణ సముదాయం నిర్మించాలని ముజాహిద్ అలం నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అవసరమైన అన్ని అనుమతులను హెచ్ఎండీఏ నుంచి తీసుకున్నాడు. నెల రోజుల క్రితం భవన నిర్మాణం కూడా ప్రారంభించాడు. విషయం తెలిసిన మన్నెగూడ సర్పంచ్ వినోద్ గౌడ్ అక్కడ వాలిపోయాడు. తనకు రూ. 20 లక్షలు ఇస్తేనే పనులు జరగనిస్తానని, లేదంటే పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలబోవని ముజాహిద్ను హెచ్చరించాడు. తాను అంత సొమ్ము ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరికి రూ. 13 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. సొమ్ము సర్దుబాటు చేశానని వచ్చి తీసుకోవాలని సర్పంచ్ వినోద్కు ముజాహిద్ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆ సొమ్ము పట్టుకుని బండ్లగూడలోని ఆరెమైసమ్మ వద్దకు తీసుకురావాలని సూచించాడు.
సర్పంచ్ చెప్పినట్టే అక్కడకు డబ్బుతో వెళ్లిన ముజాహిద్ కారులో ఉన్న సర్పంచ్కు డబ్బులు అందించాడు. అక్కడే మాటువేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడిచేసి ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వినోద్ గౌడ్ను నేడు చంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీబీకి పట్టుబడిన వినోద్ గతేడాది రిపబ్లిక్ డే నాడు కలెక్టర్ నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చెత్త సర్పంచ్ గత చరిత్రను కూడా వెలికి తీసే పనిలో పడ్డారు.