నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న విశాఖ మేయర్ ఎన్నికలలో  అధికార వైసీపీకి బిగ్ షాక్ తప్పదా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ విశాఖ పీఠం మాదేనని గట్టిగానే ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పధకాలు తీసుకున్న వారు అంతా తమకు మద్దతుగా నిలబడతారని లెక్కలు వేసుకుంటోంది.

అయితే ఈ లెక్కలు అంచనాలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే వైసీపీకి అతి పెద్ద తలనొప్పిగా రెబెల్స్ తయారు అయ్యారు. వారి ఒకరూ ఇద్దరూ లేరు. ఏకంగా పది మంది దాకా వైసీపీ ఆశలపైన వేటు వేసేలా ఉన్నారు. వీరే చివరికి వైసీపీ కొంప ముంచనున్నారు అని కూడా అంటున్నారు. మరి వీరి విషయంలో వైసీపీ అధినాయకత్వం ఏం చేస్తోంది అంటే అసలు పట్టించుకోవడంలేదు. దాంతో రెబెల్స్ గా పోటీ చేస్తున్న వారు ఎన్నికల రంగాన దూసుకుపోతున్నారు. వారు చీల్చేది కచ్చితంగా వైసీపీ ఓట్లే. వారి వల్ల నష్టం జరిగేది కూడా వైసీపీ అభ్యర్ధులకే. విశాఖ సౌత్ లో, గాజువాకలో, అలాగే  భీమిలీ నియోజకవర్గంలో దాదాపు పది డివిజనల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో వేరుగా నిలబడి పోటీ చేస్తున్న వారి వల్ల అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

అయితే అధికార పార్టీ మాత్రం వారిని అసలు ఖాతరు చేయడంలేదు. వారు ఏమీ చేయలేరని  ధీమాతో ఉంది . కానీ వారికే జనంలో బ్రహ్మరధం పడుతున్నారుట. ఈ పరిణామాలు అసలు  వైసీపీ అభ్యర్ధులకు దడ పుట్టిస్తున్నాయి. వీరి విషయంలో హై కమాండ్ సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల ఈ  పిట్ట పోరులో టీడీపీకి లాభం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా జనాల్లో పేరు ఉండి, చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్న వారిని వైసీపీ గుర్తించకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తునని కార్యకర్తలు కూడా అంటున్నారు.  చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: