లాక్డౌన్లో ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్ నష్టాల పాలవ్వడంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బంగారం ధర రూ.50 వేల మార్క్కి చేరుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అంతర్జాతీయ పరిస్థితులు... అన్నీ కలిసి బంగారం ధరలు తగ్గేలా చేస్తున్నాయి. అయితే... ఈ తగ్గింపు భారీగా ఏమీ లేదు. ఇప్పుడు బంగారం నగలు కొనుక్కోవాలని సామాన్య, మధ్య తరగతి ప్రజలు కోరుకుంటే... ధరలు ఎక్కువే అని అనిపించడం సహజం. ఎందుకంటే... ధరలు తగ్గినా... ఇప్పటికీ అవి ఆకాశంలోనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా బంగారం ధర గత ఏడాది ఆల్టైమ్ గరిష్ట స్థాయి నుంచి ఇప్పటికే 20 శాతం పతనమైంది. గోల్డ్ ఈటీఎఫ్లపై ఒత్తిడి నెలకొంది. ఇన్వెస్టర్లు డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. దీని వల్ల కూడా బంగారం ధరలపై ప్రభావం పడుతోంది. అందుకే ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలు దాదాపుగా రూ.43,800 నుంచి రూ.44,000 వేల సమీపంలో స్థిర పడొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.