ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలియని వాళ్ళు ఉండరు. ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. ప్రతిపక్షాలపై ధీటైన సమాధానాలతో రెచ్చిపోతూ వారిని ఇరకాటంలో పెట్టడంలో రోజా తరువాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని.. నేటి వరకు కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పార్టీలో ఆమెది ప్రముఖ స్థానం.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట నడిచే ముఖ్యమైన నాయకులలో ఆమె కూడా ఒకరు.  నగరి నియోజిక వర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు రోజా. ఇలా ఎమ్మెల్యేగాను, ఏపీఐఐసీ చైర్మన్‌గా, రాజకీయ నాయకురాలిగా ఎంతో బిజీ బిజీగా గడిపే ఆమె.. అప్పుడప్పుడు విశ్రాంతి కోసం సరదాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా ఎమ్మెల్యే రోజా కబడ్డీ పోటీలలో పాల్గొని ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.ఆదివారం నాడు నగరి నియోజకవర్గం పరిధిలో గల నిండ్రలో కబడ్జీ టోర్నమెంట్ నిర్వహించగా.. ఆ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోజా అక్కడికి వెళ్లారు.

అయితే, చిన్ననాటి నుంచే కబడ్డీ పట్ల ఆసక్తి ఉన్న రోజా.. ఆటగాళ్లతో కలిసి సరదాగా కబడ్డీ ఆటలో పాల్గొనడంతో అక్కడి ప్రజలు కేరింతలు కొడుతూ ఆటను తిలకించారు. గ్రౌండ్‌లోకి ఎంటరై.. కబడ్డి.. కబడ్డి అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లను పరుగులు పెట్టించారు రోజా. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. కబడ్డీ అంటే తనకు చాలా ఇష్టం అని అన్నారు. స్కూల్ రోజులు బాగా ఆడేదానని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడడంతో ఎన్నికల టెన్షన్‌లో ఉన్న తాను రిలాక్సేషన్ కోసమే కబడ్డీ ఆడుతున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా కబడ్డీ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: