ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగియనుంది.  చివరి గంటల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి పార్టీలు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలపైనే ఉంది. ఏపీలో రాజధానిపై వివాదం కొనసాగుతోంది. టీడీపీ అమరావతి కోసం ఉద్యమిస్తుండగా.. వైసీపీ సర్కార్ మాత్రం మూడు రాజధానులే తమ లక్ష్యమని చెబుతోంది.ఈ నేపథ్యంలో ఈ మూడు నగరాల ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం, శనివారం విశాఖలో ప్రచారం చేశారు. వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రౌడీలను తరిమికొట్టాలని విశాఖవాసులకు పిలుపిచ్చారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు మంచి స్పందన వచ్చింది. అయితే విశాఖలో చంద్రబాబు ఎక్కడా రాజధాని గురించి మాట్లాడలేదు. వైసీపీ సర్కార్ వైఫల్యాలపైనే మాట్లాడారు. ఆదివారం విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రబాబు. రోడ్ షాలో అమరావతి గురించి మాట్లాడారు.రాజధానిగా అమరావతి ఆమోదయోగ్యమో, కాదో ఓటు ద్వారా చెప్పాలని అన్నారు చంద్రబాబు. వైసీపీకి ఓటు వేస్తే 3 రాజధానులకు మద్దతు ఇచ్చినట్టు అవుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రులు గర్వించే రాజధాని అమరావతిని నిర్మిస్తుంటే... జగన్ వచ్చి రాజధానిని ముక్కలుగా చేసి అస్తవ్యస్తం చేశాడని చంద్రబాబు ఆరోపించారు.

విజయవాడలో చంద్రబాబు ప్రసంగాలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశాఖలో రాజధాని గురించి మాట్లాడకుండా.. విజయవాడలో మాట్లాడటం.. అది కూడా మూడు రాజధానులు.. అమరావతికి రెఫరెండం అన్నట్లుగా చెప్పడం చర్చగా మారింది. విజయవాడలో గెలిస్తే అమరావతికి మద్దతు లభించిందని చంద్రబాబు చెప్పడాన్ని బట్టి... విశాఖపై ఆయన ఆశలు వదులుకున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయవాడలో గెలిస్తే అమరావతి గెలిచినట్లు అయితే.. విశాఖలో టీడీపీ ఓడితే పరిపాలనా రాజధానిగా విశాఖను అంగీకరించినట్లు అవుతుందని కొందరు చెబుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో విశాఖ జనాల మైండ్ సెట్ లో మార్పు రావడం ఖాయమంటున్నారు. అదే జరిగితే విశాఖలో టీడీపీకి మంచి ఫలితాలు రావని చెబుతున్నారు. ఈ లెక్కన విశాఖలో తాము గెలవలేమని ముందే గ్రహించడం వల్లే.. విజయవాడలో అమరావతి సెంటిమెంట్ ను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: