తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. అయితే పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు ఉండగానే ఆమెను దుండగులు మానసికంగా దెబ్బ తీయాలని చూస్తున్న. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది. రఘునాధపాలెం మండలంలోని శివాయిగూడెం లో రహదారి పక్కన ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్ అభిమానులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని  డిమాండ్ చేశారు.



  వైఎస్ తనయ షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని. ఆమెకు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వైఎస్ అభిమానులు, షర్మిల అనుచరులు ఆరోపిస్తున్నారు. వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో విగ్రహ ధ్వంసం ఘటన కలకలం రేపింది. దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని 2013లో వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. షర్మిల ఆవిష్కరించిన విగ్రహాన్ని ధ్వంసం చేయడం చర్చనీయాంశమైంది.అప్పటి వైసీపీ నాయకులు పువ్వాడ అజయ్‌కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు కూడా శిలాఫలకంలో ఉన్నాయి. విగ్రహ ధ్వంసంపై వైఎస్ అభిమాని, స్థానిక నాయకుడు పిట్టా రామ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విగ్రహ ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండించారు.


ఖమ్మం సభను అడ్డుకునేందుకే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎవరు ఈ ఘటనలకు పాల్పడుతున్నారో అర్థమవుతోందని.. షర్మిలకు వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఇటువంటి దుశ్చర్యలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.అంతేకాదు  విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామ్ రెడ్డి డిమాండ్ చేశారు. కూల్చివేసిన చోటే మళ్లీ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు శివాయిగుడెం చేరుకుంటారని ఆయన హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏప్రిల్ 9న సభ పెట్టి తీరుతామని.. మరోసారి ఇటువంటి ఘటనలకు పాల్పడితే వైఎస్ అభిమానులుగా తాటతీస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: