ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం, చంద్రబాబు ప్రసంగాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల  సీఎం జగన్ ను ఫేక్ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు తరచుగా మాట్లాడుతున్నారని చెప్పారు. పాదయాత్ర చేసిన జగన్ ఇచ్చిన హామీల మేరకు గెలిచిన తర్వాత పథకాలు అమలు చేస్తున్నారని, ఇక ఎలా ఫేక్ ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. చంద్రబాబులా మామకు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన సీఎం కాలేదని, మరలాంటప్పడు జగన్ ఫేక్ సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించారు. చంద్రబాబు లక్ష్మీపార్వతిని, సొంత తమ్ముడ్ని, తోడల్లుడ్ని రోడ్డున పడేశారని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు.

ఇక రాజారెడ్డి రాజ్యాంగం అని, పులివెందుల పంచాయతీలు అనీ టీడీపీ నేతలు  ప్రచారం చేస్తున్నారని పోసాని తెలిపారు. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి జరిగితే కనీసం ఫిర్యాదు కూడా చేయనివ్వలేదని ఆరోపించారు. బషీర్ బాగ్ లోనూ కాల్పులు జరిపించారని ఇవన్నీ చంద్రబాబు రాజ్యాంగానికి ఉదాహరణలు అయితే.. రాజారెడ్డి రాజ్యాంగం అనడం ఏంటో తనకు అర్థంకావడంలేదని పోసాని పేర్కొన్నారు. పులివెందుల పంచాయతీలు అంటున్నారని, ఓసారి పులివెందులలో ఎంత అభివృద్ధి జరిగిందో చూడాలని పోసాని  హితవు పలికారు.  

 తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలపైనా స్పందించారు పోసాని కృష్ణ  మురళి. షర్మిలకు జగన్ అన్యాయం చేశాడంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. జగన్ ఆమెకు అన్యాయం చేసుంటే.. ఆమె ఏపీలోనే పార్టీ పెట్టి పోటీ చేసేవారు కదా అని వ్యాఖ్యానించారు. షర్మిల రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే తెలంగాణలో పార్టీ స్థాపిస్తున్నారని పోసాని వివరణ ఇచ్చారు. పార్టీ పెట్టడం తప్పేమీ కాదని, జగన్ షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న వార్తల్లో నిజంలేదని స్పష్టంచేశారు.సీఎం జగన్, షర్మిల మధ్య విబేధాలు వచ్చాయని, అందువల్లే ఆమె స్వంత పార్టీని పెడుతుందనే వాదనలు పూర్తిగా అసత్యమన్నారు పోసాని. 

మరింత సమాచారం తెలుసుకోండి: