అధికారం కోల్పోయేవరకు
ప్రభుత్వానికి, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవి విజయవంతమవలేదు. తర్వాతెప్పుడో వాటిని మారుస్తామని, ఆ తర్వాతెప్పుడో మార్పులు తెస్తామని చెప్పేబదులు ఇప్పుడే వాటిల్లో మార్పుచేస్తేనే తమ ఉద్యమాన్ని ఆపుతామని కిసాన్ యూనియన్ నేతలు తెగేసి చెప్పారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోయేవరకైనా విశ్రమించబోమని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులను సంఘటిత పరిచే కార్యక్రమంలో భాగంగా ఈ రైతు నేతలంతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తున్నారు. ఈ సమస్య ఒక్క పంజాబ్, హర్యానా రైతులది కాదని, దేశంలోని రైతులందరిదీ అని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఈ ఉద్యమం అక్కడి రైతుదేనంటూ ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు.
మహిళల ర్యాలీ
అంర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 40వేల మంది మహిళలు ఢిల్లీ దిశగా సాగుతూ నిరసన తెలపనున్నారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి చాలామంది మహిళలు ట్రాక్టర్లపై బయలుదేరారు. కొందరు తమ పిల్లలను పరీక్షలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారని బీకేయూ పంజాబ్ స్టేట్ కమిటీ సభ్యురాలు బల్బీర్ కౌర్ తెలిపారు. అయినా మరికొందరు మహిళలు ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్నారని, 500 బస్సులు, 600 మినీ బస్సులు, 115 ట్రక్కులు, 200 చిన్న వాహనాల్లో చాలా మంది మహిళలు బయల్దేరారని బీకేయూ(యుగ్రహన్) ప్రధాన కార్యదర్శి సుఖ్ దేవ్ సింగ్ కోక్రికలాన్ వెల్లడించారు. ఆదివారం రాత్రి వరకు టిక్రి సరిహద్దు వరకు చేరుకుని మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్పారు. జరిగే కార్యక్రమాలన్నీ మహిళల ఆధ్వర్యంలో జరుగుతాయని వెల్లడించారు.