చివరకు ఎమ్మెల్యేగా పని చేసి.. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు స్వయంగా మునిసిపల్ ఎన్నికల బరిలో కౌన్సెలర్ గా పోటీ చేస్తున్నారు. ఆయన పట్టణంలో 24వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. పైగా ఈయనపై పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థి ఫ్యామిలీయే ఇక్కడ గత ఎన్నికలలో గెలిచింది. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నాడు రావాలి జగన్, కావాలి జగన్ అన్నారని, ఇప్పుడు గాలి మారిందని... ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తాడిపత్రి జనాలు అందరూ రావాలి ప్రభాకర్, కావాలి ప్రభాకర్ అంటున్నారని ఆయన జోస్యం చెప్పారు. వీరి ఆదరణ చూస్తుంటే తమకు భయం వేస్తోందని.. 1952 నుంచి ఇక్కడ నిలిచామంటే అది ప్రజల్లో తమపై ఉన్న అభిమానమేనని, తమకింతటి పేరు రావడానికి ఈ ఊరే కారణమని స్పష్టం చేశారు.
ఇక వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతోన్న బాధలను తమతో చెప్పుకుంటున్నారని... రాష్ట్రంలో టీడీపీకి అత్యధిక పంచాయతీ స్థానాలు వచ్చింది తన నియోజకవర్గంలోనే అని వెల్లడించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కచ్చితంగా తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు.