ఎన్టీఆర్ నుంచి పార్టీ స్వాధీనం చేసుకున్నప్ప‌టి నుంచి చంద్రబాబు టీడీపీలో చెప్పింది వేదం.. చేసింది శాస‌నం అన్న‌ట్టుగా ఉండేది. నాటి ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి.. నేడు రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి బాబుకు పార్టీలో తిరుగులేదు. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవ‌రిని ఎప్పుడు సైడ్ చేయాలో ?  ఎవ‌రిని ఎలా త‌న వైపున‌కు తిప్పుకోవాలో చేయాల్సిందంతా చేశారు. క‌ట్ చేస్తే 2014లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచే ఆయ‌న‌కు పార్టీపై క్ర‌మ‌క్ర‌మంగా ప‌ట్టు త‌ప్ప‌డం ప్రారంభ‌మైంది. ముఖ్యంగా అవినీతి, ప‌ద‌వుల విష‌యంలో చంద్ర‌బాబునే చాలా మంది బెదిరించ‌డం ప్రారంభించారు. అప్ప‌ట్లో పార్టీ అధికారంలో ఉండ‌డంతో కాస్త మొత్తని వాళ్లను బెదిరింపులతో నోరు మూయించారు.. మిగిలిన వాళ్లు మాత్రం బాబును లెక్క చేయకుండా త‌మ ప‌ని తాము చేశారు.

2019 ఎన్నిక‌ల్లో ఎప్పుడు అయితే పార్టీ ఘోరంగా ఓడిపోయిందో అప్ప‌టి నుంచి బాబును నేత‌లు లెక్క చేయ‌డ‌మే మానేశారు. కొంద‌రు బాబును ఇష్ట‌మొచ్చిన‌ట్టు తిడుతూ పార్టీ మారిపోతున్నారు. పార్టీలో ఉన్నోళ్లు సైతం ఆయ‌న్ను బెదిరింపుల‌కు, బ్లాక్ మెయిల్‌కు గురి చేస్తున్నారు. ఎంపి కేశినేని నాని లాంటి వాళ్లు నా బ‌లంతోనే నేను గెలిచా అని అంటున్నా బాబు వారిపై ఏ మాత్రం చ‌ర్య‌లు తీసుకోలేని స్థితిలో ఉన్నారు. పార్టీలో ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, నేత‌లు కూడా బాబుపై తీరుపై గుస్సాతోనే ఉన్నారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వారు బాబుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నా ఆయ‌న కిమ్మ‌న‌డం లేద‌ట‌.

కీల‌క‌మైన పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను పార్టీలోనే చాలా మంది నేత‌లు ప‌ట్టించుకోలేదు. ఇక మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను కూడా గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వ‌దిలేశారు. ఉత్త‌రాంధ్ర ఉక్కు ఉద్య‌మం జ‌రుగుతుంటే అక్క‌డ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో కూడా తెలియ‌ట్లేదు. ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రం సొంతంగా నిరాహార దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి. సీమ‌లో గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో బాల‌య్య కూడా బాబు తీరుతో ఏమంత సంతృప్తితో లేరు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ని తాను చేసుకుంటూ.. సినిమాలు చేసుకుంటున్నారు. అటు పయ్యావుల కేశవ్ కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు.

ఇక చంద్రబాబు అధికారంలో ఉండగా.. మంత్రులుగా ఓ వెలుగు వెలిగిన నారాయ‌ణ‌, గంటా లాంటి వాళ్లు ఇప్పుడు బ‌య‌ట‌కే రావ‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని ఆదేశించినా కూడా కొంద‌రు లైట్ తీస్కొంటున్నారు. సీనియ‌ర్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే ఉన్నంత‌లో జూనియ‌ర్లే కాస్త బెట‌ర్ అనిపించుకుంటున్నారు. చివ‌ర‌కు బెజ‌వాడ‌లో కొంద‌రు నేత‌లు బాబునే కంట్రోల్ చేసేలా స‌క్సెస్ అయ్యార‌ని పార్టీ నేత‌లే గుస‌గుసలాడుకుంటున్నారు. ఏదేమైనా ఒక‌ప్పుడు క‌ను చూపుల‌తో పార్టీని కంట్రోల్ చేసిన బాబు.. ఇప్పుడు అరిచీ గీపెడుతున్నా పార్టీ కీల‌క నేత‌లే చెవిటోడి ముందు శంఖం ఊదిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: