గత 2014 ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ నాయకుడు చాంద్ బాషా తర్వాత కాలంలో టీడీపీలో చేరిపోయారు. అయితే.. ఆయనకు గత ఎన్నికల్లో టిక్కెట్ రాలేదు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో సరైన వర్గం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ దూకుడు ఎక్కువగా కనిపిస్తున్నా.. కనీసం.. సగానికిపైగా వార్డులను గెలుచుకునేందుకు కందికుంట వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాల్లోని డొల్లతనాన్ని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. గెలుపు ఓటములతో సంబధం లేకుండా...గత రెండు దశాబ్దాల కాలంగా ఇతర పార్టీల నుంచి ఎంత మంది నేతలు కదిరి రాజకీయాల్లోకి వచ్చి పోయినా కందికుంట ప్రజల్లోనే ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్.
ఈ క్రమంలోనే కదిరి ప్రజలు ఇతర నేతల పాలనను కందికుంట పాలనతో భేరీజే వేసుకుంటున్నారు. తాజా మునిసిపల్ పోరులో తమ వారిని గెలిపించడం ద్వారా.. స్థానికంగా సేవలు మరింత చేరువ చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇటీవల చంద్రబాబును సైతం ఆయన ఇక్కడ పర్యటించి పార్టీలో ఉత్తేజం నింపాలని కోరినట్టు సమాచారం. చంద్రబాబు నారా లోకేష్ను పంపుతామని హామీ ఇచ్చారు. కానీ, బిజీ షెడ్యూల్ కారణంగా.. ఇప్పుడు ఇద్దరు కూడా అనంతపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ కందికుంట ఒంటరి పోరు.. పార్టీకి బలంగా మారింది.
కదిరి మున్సిపాల్టీ 2014లో కందికుంట ఆధ్వర్యంలో టీడీపీ గెలుచుకుంది. ఈ సారి కూడా అదే రిపీట్ చేస్తానని కందికుంట ధీమాతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా... ఇక్కడ కందికుంట ఇమేజ్ పార్టీకి ప్లస్ అయ్యేలా ఉంది. 36 వార్డుల్లో టీడీపీ 34 చోట్ల పోటీ చేస్తోంది. మరి ఈ పోరులో కందికుంట ఏ మేరకు వైసీపీని ఢీకొట్టి కదిరిలో టీడీపీ జెండా ఎగర వేస్తాడో ? చూడాలి.