కేటీఆర్ ను నూతన ముఖ్యమంత్రిగా పట్టాభిషేకానికి సిద్ధం చేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం నిర్ణయించారా? అంటూ రాజకీయ నేతలు సమాచారం కోసం విషయసేకరణ ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ పరిసమాప్తి సమయంలో రాజకీయాల్లోకి తండ్రి పనుపున వచ్చి ఉద్యమంలో చేరిన కేటీఆర్ కొద్ది కాలంలోనే దీటైన నాయకుడిగా ఎదిగారు.
తెలంగాణ వాదాన్ని వినిపించడంలోను ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడంలోనూ కలవకుంట్ల వారి సహజ మాటల చాతుర్యాన్ని ప్రదర్శించి తన తండ్రి కేసీఆర్ ని మించి అందులోను తండ్రిని మించిన తనయుడుగా నిలిచి పోయారనే కీర్తి స్వంతం చేసుకున్నారు.
ఉద్యమం ఆ తరవాత కొత్త రాష్ట్రం తెలంగాణలో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లోనూ ఆయన దూకుడుగా పార్టీ గెలుపు కోసం పనిచేశారు.
ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో 2009 ఎన్నికల నుంచి కేటీఆర్ తనదైన దూకుడు చూపిస్తున్నారు. వరుస విజయాలతో పార్టీకి మార్గదశకుడుగా మారారు. తన సిరిసిల్ల నియోజకవర్గమే మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లోనూ, ప్రత్యేకించి హైదరాబాద్ జంటనగరాల్లోను తనదైన ముద్ర వేశారు.
“గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ - జిహెచెంసి” సహా, హైదరాబాద్ లోని పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల్లోనూ కేటీఆర్ మహావేగంగా ముందుకు సాగుతున్నారు. అసలు తన వారసుడు కేటీఆర్ కు రాష్ట్రాన్ని అప్పగించే విషయం 2018 ఎన్నికల తర్వాత నుండే పరిశీలనలో ఉందని అంటున్నారు. అందుకే పార్టీలో “వర్కింగ్ ప్రెసిడెంట్” పదవిని సృష్టించి ఇచ్చారు.
“వర్కింగ్ ప్రెసిడెంట్” పదవిని కూడా కేటీఆర్ అద్భుతంగా నిర్వహిస్తున్నారని పార్టవర్గాల్లొ వ్యక్తమవుతోంది. అందరినీ కలుపుకొని పోవడంతో పాటు, ఏసమస్య వచ్చినా, ఆరితేరిన పరిష్కర్తగా మాట్లాడటం, అలా వ్యవహరించే నైపుణ్యాన్ని కేటీఆర్ సాధించుకున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం ప్రస్తుతం వచ్చింది కాదని గతంలోనూ ప్రచారంలోకి వచ్చిందని, కేంద్రంలో పలుకుబడి పెంచుకోవడం కోసం, అలా కాకుంటే బీజేపీకి దీటుగా, ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదికను నిర్మించడం కోసం కేసీఆర్ అప్పట్లో ఈ ప్రయత్నాలు చేశారు.
ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతను తన వారసుడైన తన కుమారుడికి ఇవ్వనున్నారనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. కానీ, అప్పుడు అనుకున్న విజయాలు అనుకున్నట్లు లభించక పోవటం, తానొకటి తలిస్తే దేవుడు మరొకటి తలవటంతో ఆనాటి ప్రతిపాదన మొగ్గ దశ లో ఆగిపోయిందని దరిమిలా కేసీఆర్, మరోసారి సీఎంగా బాధ్యతల భారం తనే స్వీకరించారు.
ఇక ఇప్పుడు బీజేపీ దూకుడు మరింతగా ప్రదర్శిస్తూ ఉండటం నూతన యువత నాయకలుగా కొత్తతరం దూసుకొస్తున్న వేళ ఇతర పార్టీలలో దూసుకువస్తూ ఉండటంతో పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. ఇలానే ఉంటే మున్ముందు తన టీఅరెస్ పార్టీకి, తన ప్రభుత్వానికి కూడా తిప్పలు తప్పని వాతావరణం రూపు దిద్దుకుంటున్నట్లు కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏకంగా కేంద్రంలోనే పావులు కదపడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు వీలు కలిగించు కోవటానికి ఆయన తన సీఎం పదవిని తన వారసునికి వెనువెంటనే అప్పగించాలని అనుకుంటున్నారని, శరవేగంగా ఈ పట్టాభిషేక మహోత్సవానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారని విశ్లేషకుల పరిశీలన. మరి ఈ నాయకత్వ మార్పు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననేది వేచి చూడాల్సిన విషయం.
ఇక కేసీఆర్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, అమాయకుల మీద దౌర్జన్యాలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జాతి సంపద దోచేస్తున్నారు అన్న వార్తలు మిన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ డిల్లీలో కీలక రాజకీయాల్లోకి వెళ్ళటం మాట, అటుంచి మహాభినిష్క్రమణానికి లేదా వానప్రస్తానికి సిద్దమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా తోస్తుంది.
ఇదిలా ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే టీఆర్ఎస్ లోని మరో ముఖ్యనేత, కేసీఆర్ కూతురు కవిత పరిస్థితి ఏంటనే దానిపై కూడా టీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నట్లు వినిపిస్తోంది. కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే కేసీఆర్ మంత్రివర్గం రద్దవుతుంది.
తెలంగాణలో మళ్లీ కొత్త మంత్రివర్గం ఏర్పాటవుతుంది. అప్పుడు కేబినెట్ కూర్పులో కచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ఆ మార్పుల్లో భాగంగా కవితకు కీలక పదవి దక్కుతుందనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ కేబినెట్లో కవితకు కచ్చితంగా చోటు దక్కుతుందని ఇప్పటివరకు కేటీఆర్ చూస్తున్న కీలకమైన మున్సిపల్ శాఖ కవితకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీఆర్ఎస్ లోని కొందరు చర్చించు కుంటున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవితను కేబినెట్ లోకి తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసినప్పుడు కవిత ను మంత్రిని చేయాలని కేసీఆర్ గతం లోనే నిర్ణయించారని పలువురు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కవిత కోరిక కూడా ఈ విధంగా తీరుతుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.