తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది అని డీజీపీ చెప్పుకొచ్చారు. ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలను తీసుకున్నాము అని అన్నారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు భారీగా 69 ప్లటూన్ల కేంద్ర బలగాలతో ఈ ఎన్నికల్లో కట్టు దిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేశాం అని తెలిపారు.ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అని ఆయన అన్నారు. సరిహద్దులలో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ఇప్పటికే సుమారు 250పైగా వాహనాలను తిప్పి పంపాము అని తెలిపారు.
ఇప్పటి వరకు 33,966 మందిని బైండ్ ఓవర్ చేయగా..76,04,970 లక్షల రూపాయల నగదును సీజ్ చేశామని.. 6884 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి..94 వాహనాలను జప్తు చేసాం అని వెల్లడించారు. ఉద్దేశ్యపూర్వకంగా శాంతి భద్రత లకు భంగం కలిగిస్తారనే సమాచారం మేరకు అనుమానితులపైన నిరంతర నిఘాను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద ఏ సమస్య ఉత్పన్నమైన తక్షణమే డయల్ 100, 112 ద్వారా పోలీసు కు సమాచారం అందివ్వాలని ప్రజలను కోరుతున్నామనీ తెలిపారు. ఇప్పటికే చాలామంది తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ప్రజాసామ్య పరిరక్షణ లో తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.