తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ నమోదైంది. కరోనా భయపెడుతున్నా సాగర్ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగులో పాల్గొన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉండగా.. రికార్డ్ స్థాయిలో 85 శాతానికి పైగానే ఓటింగ్ నమోదైంది. అంచనా కంటే మించి ఓటింగ్ నమోదు కావడంతో ఫలితంపై పార్టీల్లో టెన్షన్ కనిపిస్తోంది. పోలింగ్ ఎక్కువ నమోదు కావడం తమకే లాభిస్తుందని అధికార పార్టీ భావిస్తుండగా.. ప్రజా వ్యతిరేకత వల్లే ఓటింగ్ పెరిగిందని, తమకే కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎవరూ గెలుస్తారన్న దానిపై పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ నిర్వహించింది.ఎగ్జిట్ పోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు లీడ్ కనిపిస్తోంది. 48 - 51 శాతం ఓట్లు టీఆర్ఎస్ కు వస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి 38-42 శాతం ఓట్లు సాధిస్తారని సర్వేలో తేలింది. సాగర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి మాత్రం డిపాజిట్ వచ్చే అవకాశం కన్పించడం లేదు. రవినాయక్ కు కేవలం 10 -12 శాతం ఓట్లే లభిస్తాయని సర్వేలో వెల్లడైంది.

మండలాల వారీగా చూస్తే మొత్తం ఏడు మండలాల్లో  మూడు మండలాల్లో టీఆర్ఎస్ కు  లీడ్ వస్తుండగా  ఒక మండలంలో కాంగ్రెస్ కు ఆధిక్యత వస్తుందని పల్స్ టుడే అంచనా వేసింది. మూడు మండలాల్లో  కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గుర్రంపోడు, తిరుమల గిరి సాగర్, మాడ్గుల మండలాల్లో కారుకు లీడ్ రానుండగా... హాలియా అనుమల మండలంలో కాంగ్రెస్ కు మంచి మెజార్టీ రానుంది. పెద్దవూర,  నిడమనూర్ , త్రిపురారం మండలాల్లో రెండు పార్టీల మధ్య టప్ ఫైట్ నడిచింది. హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు పోలింగ్ సానుకూలంగా ఉండగా.. నాగార్జున సాగర్ పట్టణంలో మాత్రం కారుకు ఏకపక్షంగా సాగిందని పల్స్ టుడే సర్వేలో తేలింది.  

మొత్తంగా నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు.. జానారెడ్డి కంటే దాదాపు 8-11 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పల్స్ టుడే అంచనా వేసింది. టీఆర్ఎస్ పోల్ మేనేజ్ మెంట్ ముందు కాంగ్రెస్ ఢీలా పడిందని తెలుస్తోంది. కేసీఆర్ సభ తర్వాత టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడంతో కాంగ్రెస్ కు కొంత ఇబ్బంది కల్గిందని చెబుతున్నారు.నెల్లికల్ లిఫ్ట్ కూడా టీఆర్ఎస్ కు భారీగానే ఓట్లు కురిపించిందని పల్స్ టుడే సర్వేలో స్పష్టమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: