ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని పునాదులతో సహా పెకిలించివేయడానికి ముఖ్యమంత్రి జగన్రెడ్డి సమాయత్తమవుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమిపాలైనా, ఆ పార్టీ ఎమ్మెల్యేలుకానీ, నేతలుకానీ వైసీపీలో చేరినా కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా నిలబడ్డారు. పార్టీ ఏర్పాటైనప్పటినుంచి తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న కార్యకర్తలతోపాటు ప్రాథమిక సహకార సంఘాలు, డెయిరీలపై జగన్ దృష్టిపెట్టారు. సంగం డెయిరీ, విజయ డెయిరీ లాంటి కంపెనీలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వాలంటీర్లను ఉపయోగించుకొని గ్రామగ్రామాన పాలసేకరణ అమూల్కు తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అమూల్ ఇక్కడికి రావడం మన అదృష్టమంట!
అమూల్ ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ అని , ఆ కంపెనీ ఏపీలో పాలను సేకరించడం.. ఇక్కడి ప్రజల అదృష్టంగా జగన్ అంటున్నారు.
రాష్ట్ర డెయిరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అమూల్తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెబుతున్నారు. అమూల్ ప్రాజెక్ట్పై తాజాగా జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లాలో ‘అమూల్ పాల వెల్లువ’ ప్రాజెక్ట్ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి చేకూరుతుందని, ఇప్పటికే 400 గ్రామాల్లో పాలసేకరణను చేపట్టామన్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలే మొదటి లక్ష్యం?
గుంటూరు జిల్లాలో 180 గ్రామాల్లో పాలసేకరణకు శ్రీకారం చుట్టామని.. చిత్తూరు జిల్లాలో మరో 170 గ్రామాల్లో పాలసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మూల్ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉందని, అక్కచెల్లెమ్మలే వాటాదారులు.. అమూల్తో ఒప్పందం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది.. అమూల్ సంస్థ లాభాలను పాడి రైతులకే తిరిగి చెల్లిస్తుందని ముఖ్యమంత్రి అమూల్ గురించి డప్పాలు కొట్టారు. ఇతర రాష్ట్రాల్లో అమూల్ సంస్థ ఉంది. ఏ ముఖ్యమంత్రులూ ఆ కంపెనీకి సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. స్థానిక పాల ఉత్పత్తిదారులను కాపాడుకుంటూనే అమూల్కు అవకాశం ఇస్తున్నారు. ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ప్రయివేటు డెయిరీలు, ప్రభుత్వ డెయిరీలు ఏమైనా పర్వాలేదు.. ఆ కంపెనీల ఉద్యోగులు రోడ్లమీద పడినా పర్వాలేదు.. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బలహీనపడాలి.. నా అధికారానికి ఎదురుండకూడదు.. అనే ధోరణిలో ఏపీ ప్రభుత్వం ఉండటం ఇక్కడి ప్రజల దురదృష్టమని చెప్పవచ్చు.