భూముల రిజిస్ట్రేషన్లలో భారీగా అక్రమాలు జరుగుతుంటాయి. ఒకరి భూమిని ఒకరికి తెలియకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు అధికారులు, కాసుల కక్కుర్తిలో ప్రభుత్వ భూములను అప్పనంగా పట్టాలు ఇచ్చేస్తుంటారు. ఫారెస్ట్, ఇరిగేషన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన ఘటనలు గతంలో చాలా వెలుగుచూశాయి. తెలంగాణలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.  తాజాగా నిర్మల్ జిల్లాలో వెలుగు చూసిన భూ బాగోతం మాత్రం అందరిని షాకింగ్ కు గురి చేస్తోంది.

నిర్మల్ జిల్లాలో 19 ఏళ్ల క్రితం జరిగిన దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పెంబి మండలంలోని వేణునగర్‌ ఆదివాసీలు గతంలో అటవీ ప్రాంతంలోని కొత్తచెరువుగూడలో నివసించేవారు. ఆ గ్రామం నుంచి పెంబి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న 4.32 ఎకరాల అసైన్డ్ వ్యవసాయ భూమి ఉంది. ఆ ల్యాండు ను  60 వేల రూపాయలకు కొనుగోలు చేసిన ఆదివాసీలు అక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. అయితే ఈ భూమిపై కన్నేసిన  పెంబికి చెందిన ఓ వ్యాపారి అక్రమానికి పాల్పడ్డాడు.

స్థానిక అధికారుల సాయంతో 2002లో ఈ భూమిని తన భార్య పేరున గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వ్యాపారి. ఈ విషయం అక్కడ ఉంటున్న వారికి తెలియదు. ప్రస్తుతం ఈ భూమి ధర కోటి రూపాయలకు పైగా పలుకుతోంది. ‘ధరణి’లో ఈ భూమి వ్యాపారి పేరుపైనే అసైన్డ్ భూమిగా నమోదై ఉంది. అంతేకాదు గత మూడేళ్లుగా రైతు బంధు సాయం కూడా ఆ వ్యాపారి తీసుకుంటున్నారు. తాజాగా వ్యాపారి వచ్చి ఆ భూమి తనదేనని చెప్పడంతో రైతులు విస్తుపోయారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సర్పంచ్ రాధతో కలిసి తహసీల్దార్‌కు గ్రామస్థులు విన్నవించారు. తమకు పట్టాలు ఇవ్వమంటే ఇవ్వని అధికారులు వ్యాపారికి మాత్రం అక్రమంగా పట్టా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామాన్నే రాసివ్వడంపై అంతా ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: