కరోనా నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో  ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి శుభవార్త. నెలకు రూ. 2000 ఆపత్కాల  ఆర్ధిక సాయం తో పాటు  కుటుంబానికి  25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ నిర్ణయించిన ఆర్థిక సాయం నేటి నుంచే ప్రారంభం కానుంది.


ప్రైవేటు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది బ్యాంక్‌ ఖాతాల్లో నేటి నుంచి ప్రభుత్వం అందించే రూ.2వేల సాయం జమ కానుంది. పాఠశాలలు మూసివేతతో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది దీంతో లబ్ది పొందనున్నారు. తెలంగాణలోని  1,24,704 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది లబ్ధిపొందనున్నారు. లబ్ధిపొందేవారిలో 1,12,048 మంది ఉపాధ్యాయులు ఉండగా...  12,636 మంది ఇతర సిబ్బంది ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


ఈ ఆర్థిక సాయం కోసం  మొత్తం 2,09,873 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 1,24,704 మందిని అర్హులుగా విద్యాశాఖ తేల్చింది. వీరికి రేపట్నుంచి ఒక్కో కుటుంబానికి 25 కిలోల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రయివేటు  విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో  స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకున్నారు.


ప్రైవేటు టీచర్ల కష్టాలపై ఇండియా హెరాల్డ్ గతంలో వరుస కథనాలు రాసింది.  ప్రైవేటు టీచర్ల తరపున గళం వినిపించింది. వారి ఇబ్బందులుపై ఒకటి కాదు.. రెండు కాదు.. రోజుల తరబడి కథనాలు ప్రచురించింది. ఈ కథనాలు చివరకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కదిలించాయి. నెలకు రూ. 2000 ఆపత్కాల  ఆర్ధిక సాయం తో పాటు  కుటుంబానికి  25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ నిర్ణయించారు. ప్రయివేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను  మానవీయ దృక్ఫథంతో  ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: