కరోనా రెండో దశ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. ముగ్గురుకు మించి వినియోగదారులు ఎక్కడా గుమ్మికూడకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. పట్టణాల్లో చిరు వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు, టిఫిన్ బళ్ల నిర్వాహకులు వంటి వారిపై ఆర్థిక ప్రభావం చూడకుండా ప్రత్యామ్నాయాలు కల్పించాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. మాస్క్ ధరించని వారిని ప్రశ్నించి వారు మాస్కు ధరించేలా చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలను నియమించాలి అని సూచించారు.

రక్తనిధి కేంద్రాల్లో తగినంత రక్తం నిలువ ఉండేలా ఉద్యోగులు, ఇతర స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలి. రక్తదానం చేసే వారికి ఉచితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి అని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య పెరిగేకొద్ధీ ప్లాస్మా డోనర్ల డిమాండు పెరుగుతోంది. అన్ని జిల్లా అసుపత్రుల్లో తగినం ప్లాస్మా డోనర్ల సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి అని ఆయన సూచించారు. వలస కూలీల బాధలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నందున వారికి ఆకలి బాధ లేకుండా తగినన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచనలు చేసారు.

పాఠశాలలను మూసివేసినా విద్యార్థులు పౌష్టికాహారం, శానిటరీ న్యాప్‌కిన్‌లను అందే విధంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రోత్సహించాలి అని అన్నారు. ఉపాధి హామీ పనుల డిమాండ్ కు తగ్గట్టుగా కేంద్రానికి ప్రణాళికలు పంపి తగినన్ని నిధులు రాబట్టాలన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యలపై సామాజిక మాధ్యమాల్లో సమాచారాన్ని అందించాలి అని ఆయన స్పష్టం చేసారు. టీకా వయస్సు పరిమితిని కేంద్రం సడలించేలా రాష్ట్ర ప్రభుత్వ చొరవ చూపాలి అని కోరారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ లు, విమానాశ్రయాల్లో కోవిడ్ ప్రమాణాలు పాటించటంతో పాటు వీలైనన్ని తక్కువ ప్రయాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి అని సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: