మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఈ ఘటన. ఆదివారం రాత్రి జరిపట్కలోని తిరుపూడి ఆసుపత్రి సిబ్బంది ఆక్సిజన్ అయిపోయిందంటూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిపట్క పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ లేదని, అత్యవసరంగా 15 మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కావాలని మొరపెట్టుకున్నారు. కనీసం 10 సిలిండర్లయినా కావాలంటూ పోలీసులను కోరారు.
హాస్పిటల్ వినతితో వెంటనే స్పందించారు ఎస్సై మహాదేవ్ నాయక్ వాదె. తన సిబ్బందితో కలిసి స్థానికంగా ఉన్న ఆక్సిజన్ తయారీ ప్లాంట్ కు వెళ్లారు. కరోనా పేషెంట్ల కోసం ఆక్సిజన్ కావాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే పర్మిషన్ లెటర్ లేకుండా ఆక్సిజన్ ఇవ్వబోనని ఆ యజమాని తేల్చి చెప్పడంతో.. అక్కడ ఎమర్జెన్సీ గురించి ఎస్సై మహాదేవ్ వివరించారు. దీంతో ఏడు సిలిండర్లను ఆ యజమాని అందించాడు.
ఆ సిలిండర్లను తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన సిబ్బంది పరిస్థితి విషమంగా ఉన్న 15 మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందించారు. వాళ్ల ప్రాణాలు నిలిచాయి. అయితే ఆక్సిజన్ సిలిండర్లను తీసుకురావడంపై ఎస్ఐ మహాదేవ్ నాయక్ వాదెపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించి సిలిండర్లు తీసుకొచ్చారన్న ఆరోపణలతో మహాదేవ్, ఆయనతో పాటు వెళ్లిన సిబ్బందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.