కరోనా విలయతాండవం చేస్తున్న మహారాష్ట్రలో ఓ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆపద్భాందవులుగా మారాయి. ఎంతో రిస్క్ తీసుకుని 15 మంది కరోనా రోగుల ప్రాణాలు కాపాడారు. అయితే 15 మందిని ప్రాణం పోసిన ఆ పోలీసులపై మాత్రం కేసు నమోదైంది. రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సహా సిబ్బందిపై కేసు నమోదు చేశారు.

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఈ  ఘటన. ఆదివారం రాత్రి జరిపట్కలోని తిరుపూడి ఆసుపత్రి సిబ్బంది ఆక్సిజన్ అయిపోయిందంటూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిపట్క పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ లేదని, అత్యవసరంగా 15 మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కావాలని మొరపెట్టుకున్నారు. కనీసం 10 సిలిండర్లయినా కావాలంటూ పోలీసులను కోరారు.

హాస్పిటల్ వినతితో వెంటనే స్పందించారు ఎస్సై మహాదేవ్ నాయక్ వాదె. తన సిబ్బందితో కలిసి స్థానికంగా ఉన్న ఆక్సిజన్ తయారీ ప్లాంట్ కు వెళ్లారు. కరోనా పేషెంట్ల కోసం ఆక్సిజన్ కావాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే పర్మిషన్ లెటర్ లేకుండా ఆక్సిజన్ ఇవ్వబోనని ఆ యజమాని తేల్చి చెప్పడంతో.. అక్కడ ఎమర్జెన్సీ గురించి ఎస్సై మహాదేవ్ వివరించారు. దీంతో ఏడు సిలిండర్లను ఆ యజమాని అందించాడు.

ఆ సిలిండర్లను తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన సిబ్బంది పరిస్థితి విషమంగా ఉన్న 15 మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందించారు. వాళ్ల ప్రాణాలు నిలిచాయి. అయితే  ఆక్సిజన్ సిలిండర్లను తీసుకురావడంపై ఎస్ఐ మహాదేవ్ నాయక్ వాదెపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించి సిలిండర్లు తీసుకొచ్చారన్న ఆరోపణలతో మహాదేవ్, ఆయనతో పాటు వెళ్లిన సిబ్బందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కరోనా రోగులకు అత్యవసరంగా ఆక్సిజన్ కావాలని కోరడంతో ఎస్ఐ వేగంగా స్పందించిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే అతనిపై కేసు నమోదు చేశారన్న విషయం తెలిసి అంతా షాకవుతున్నారు. మంచి పని చేసిన ఎస్ఐని అభినందించాల్సింది పోయి కేసు పెట్టడం ఏంటని రోగుల బంధువులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: