వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చిత్రమైన పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. జగన్మోహన్రెడ్డి జైలులో ఉన్నప్పుడు పార్టీనే ముఖ్యమని భావించిన కొందరు నేతలు ప్రజల మధ్య తరగి జగన్పై సానుభూతి పెరిగేలా చేశారు. వీరిలో చాలా మంది గత ఎన్నికల్లో విజయం దక్కించుకుని ఎమ్మెల్యేలయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో తనను విమర్శించినవారినే జగన్ చేరదీయడం ప్రారంభించారు జగన్. వీరిలో చాలామందికి కీలక మంత్రి పదవులు కూడా లభించాయి. కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, వెలంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్ వంటివారు ఉన్నారు.
పార్టీ కోసం కష్టపడితే!!
పార్టీ కోసం కష్టపడ్డవారికి.. జగన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకువారికంటే.. ఆయనను గతంలో విమర్శించినవారినే ఇప్పుడు అందలం ఎక్కించాడనే విమర్శలు సొంతపార్టీలోనే వినపడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్రెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకోవడం.. ఆ తర్వాత ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు నమోదవడం జరిగాయి. వీటికి కారణం అప్పటి యూపీఏ-2 చైర్ పర్సన్ సోనియాగాంధీ అంటూ ప్రచారం జరగడంతో పలు పార్టీలకు చెందిన నాయకులు అసెంబ్లీలో, బయట జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అనంతరం చోటుచేసుకున్న పరిణామాల్లో ఈ తిట్టిన నేతలే వైసీపీలోకి వచ్చి.. ఎమ్మెల్యేలుగా గెలిచి.. మంత్రులయ్యారు.
ఈసారి ఎన్నికలకు కష్టమే?
ఎవరైతే గతంలో తనపై మండిపడ్డారో వారికే మంత్రి పదవులివ్వడం.. నమ్ముకున్నవారిని, పార్టీకోసం శ్రమించినవారిని పక్కన పెట్టడంవంటివి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికలవరకు కొనసాగితే వైసీపీ ఈసారి అధికారంలోకి రావడం కష్టమేనని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. తనకు గతంలో అండగా నిలబడినవారెవరు? భవిష్యత్తులో నిలబడేవారెవరు? అవకాశవాద రాజకీయాలు చేసేవారెవరు? లాంటివన్నీ బేరీజు వేసుకొని పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేస్తేనే నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని.. లేదంటే కష్టమేనని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి జగన్రెడ్డి ఏం చేస్తారో చూద్దాం!