కర్ణాటక రాష్ట్రంలోని కురబరహళ్లి ప్రాంతంలోని 200 ఎకరాలను కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మృతి చెందిన మృతదేహాలను ఖననం చేసేందుకు తొలుత ఆ ప్రాంత ప్రజలు అంగీకరించలేదు. ఇక కరోనా వైరస్ తో మృతి చెందిన వారిని ఆ ప్రాంతంలో ఖననం చేయడం ద్వారా చుట్టుప్రక్కల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ మృతదేహాల కారణంగా తమకు కరోనా వైరస్ సోకుతుందేమో అని భయాందోళన వ్యక్తం చేశారు.
అయితే అధికారులు ఆ ప్రాంత ప్రజలతో చర్చలు జరపడంతో ఎట్టకేలకు ఒప్పుకున్నారు. బుధవారం రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. ఇక్కడ రెండు నెలల పాటు మాత్రమే ఇక్కడ అంత్యక్రియలు జరుపుతామని స్థానికులకు మంత్రి హామీ ఇచ్చారు. మృతదేహాలను పూడ్చి పెట్టడం లేదని దహనం చేస్తున్నందు వల్ల వైరస్ సోకే అవకాశం లేదని.. కంగారు పడాల్సిన పని లేదని మంత్రి స్థానికులకు చెప్పారు. ఇక ఈ ప్రాంతంలో 200 ఎకరాలు సిద్ధం కావడంతో మరో రెండుమూడు రోజుల్లో కురుబరహళ్లి గోమాళ ప్రాంతంలో కరోనా మృతులకు అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇక బెంగళూరులో విద్యుత్ తో పాటు కట్టెలతో కాల్చే శ్మశాన వాటికలు మొత్తం 14 ఉన్నాయి. అయితే.. రోజుకు వందకు పైగా కరోనా మరణాలు నగర పరిధిలో నమోదవుతుండటంతో అంత్యక్రియలు జరపడం కష్టతరమైంది. స్మశానాల దగ్గర రోడ్ల పక్కన అంబులెన్స్ లు బారులు తీరి ఉండటాన్ని చూస్తున్న నగర ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. దింతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.