ఇప్పుడు కరోనాకు ప్రపంచ వ్యాప్తంగా అనేక టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇండియాలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఈ టీకాలు రెండు డోసులు తీసుకోవాలి. రెండు డోసుల మధ్య నిర్ణీత గడువు వుండాలి. ఆ సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. ఒక డోసు వేసుకుంటే.. మరో డోసుకు సమయానికి టీకా దొరక్కపోతే కష్టమే. అదీ కాక.. మొదటి డోసు వేసుకున్న టీకానే రెండో డోసు కూడా వేసుకోవాలి. ఇలాంటి చిక్కులు ఉన్నాయి.
ఇప్పుడు ఆ చిక్కులు లేకుండా రష్యాకు చెందిన సంస్థ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది సింగిల్ డోస్ వ్యాక్సీన్. ఈ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ అన్నిరకాల కరోనా స్ట్రేయిన్లపై దాదాపు 80 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైందని రష్యాకు చెందిన టీకా అభివృద్ధి సంస్థఆర్డీఐఎఫ్ తెలింది. హ్యూమన్ ఆడినో వైరస్ జన్యు పున:సంయోజకత ఆధారంగా తయారైన ఈ సింగిల్ డోస్ టీకా కొవిడ్ను అరికట్టడంలో సమర్థంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది.
ఈ స్పుత్నిక్ లైట్ టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత విశ్లేషించిన సమాచారం ప్రకారం....స్పుత్నిక్ లైట్ 79.4 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఆర్ఐడీఎఫ్ వెల్లడించింది. ఇది రెండు డోసుల్లో లభిస్తున్న మిగతా టీకాల కంటే ఎక్కువ ప్రభావవతంగా పనిచేస్తున్నట్లు ఆర్ఐడీఎఫ్ స్పష్టం చేసింది. కేవలం ఒక్క సూదితో తీవ్రమైన కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లే అవసరం లేకుండా చేస్తోందని వివరించింది. తక్కువ సమయంలో ఎక్కువ మందికి వేగంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు స్పుత్నిక్ లైట్ సాయపడుతుందన్న మాట.