దేశం మొత్తం కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నమోదవుతూ వస్తున్నాయి. దిల్లీలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 18వేలకుపైగా కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం గడిచిన రెండు వారాల్లోనే దాదాపు 6వేల మంది మృత్యువాతపడటం ఢిల్లీలో భయానక వాతావరణానికి అద్దం పడుతోంది. కొన్ని రోజులుగా నిత్యం అక్కడ దాదాపు 400లకు పైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది రోగులు ఆక్సిజన్ అందకనే మృతిచెందుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.దిల్లీలో మెడికల్ ఆక్సిజన్ కొరత సమస్య పరిష్కారం అయ్యింది. ఇప్పటినుంచి ఏ ఒక్క రోగికి అసౌకర్యం కలగదన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తామని.. మూడు నెలల్లోనే అందరికీ అందిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోతున్న విషయం తెలిసిందే. రెండో డోస్ కోసం అనేక రాష్ట్రాలు మొదటి డోస్ కోసం వచ్చేవాళ్లను తిప్పి పంపిస్తున్నాయి. వ్యాక్సిన్ కొరత తీరడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందన్నది ప్రాథమిక అంచనా మాత్రమేనని చెబుతున్నారు. కేజ్రీవాల్ మూడు నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్ అందేలా చూస్తామని చెబుతుండటం అంత నమ్మశక్యంగా లేదని ఢిల్లీ ప్రజలు పేర్కొంటున్నారంట.