అప్పట్లో కరోనా మహిళలని పెద్దగా ప్రభావితం చేయడం లేదని వార్తలు రాగా ఇప్పుడు కరోనా సోకుతున్న మహిళలు శాతం పెరిగిందని తెలంగాణ గణాంకాలు చెబుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే , గతంలో 34 శాతం మహిళలు కరోనా భారిన పడగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ సమయంలో 38.5 శాతానికి పెరిగినట్లు సమాచారం. అంతేకాదు వీరిలో ప్రమాద స్థాయి కూడా పెరిగినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గతంలో హాస్పిటల్స్ లో చేరిన మహిళల అడ్మిషన్ల శాతం 33 గా ఉండగా ఇప్పుడు అది 39 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ మొదలుకుని మహిళల కరోనా కేసులు పెరగడం మొదలయ్యాయి.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మహిళలు, వయసు పైబడిన మహిళలు ఎక్కువ కరోనా కాటుకు బలవుతున్నారని చెబుతున్నారు. కాబట్టి మహిళలు ముందుకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఇదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ప్రస్తుతం చిన్నారులు కూడా భారీగానే కరోనా భారిన పడుతున్నట్లు చిన్నపిల్లల వైద్య నిపుణులు అంటున్నారు . అయితే పిల్లలు చిన్నపాటి లక్షణాలతోనే త్వరగా కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. వీరిలోని వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండటమే దీనికి కారణమంటున్నారు.