తెలంగాణాలో కరోనా పరిస్థితి నేపధ్యంలో బిజెపి నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా సిఎం కేసీఆర్ ని ఈ అంశం టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో సీఎం కేసిఆర్ ఆదేశాలు అమలు కావడం లేదన్న బండి సంజయ్... రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మరణాలు , కేసులను తగ్గించి చూపిస్తోందని ఆరోపణలు చేసారు. రంజాన్ పండుగ తర్వాత రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాల్సింది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.

వాస్తవ నివేదికలు ఇవ్వకపోవడం వలన తెలంగాణ కేంద్రం సహాయం పూర్తిగా పొందలేకపోతోంది  అని అన్నారు. ప్రధాని మోదీకి సలహాలిచ్చానని సీఎం కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటు అని ఎద్దేవా చేసారు. అంతర్గత సమావేశ విషయాలు బయటకు చెప్పటం సరైంది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. కింగ్ కోఠి ఆసుపత్రిలో పేషెంట్ల మరణాలకు కారకులు ఎవరు? ఎవరు భాద్యత వహిస్తారు? అని నిలదీశారు.

తెలంగాణలో పరిస్థితి అదుపు తప్పింది. కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని మండిపడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడే నిర్ణయాలు తీసుకుంటే సహకరిస్తాం అని ఆయన స్పష్టం చేసారు.  రంజాన్ పండుగకు ఇచ్చే ప్రాధ్యాన్యత ప్రజల ప్రాణాలకు సీఎం కేసీఆర్ ఇవ్వటం లేదు అని విమర్శించారు. రంజాన్ కంటే ముందు లాక్ డౌన్ పెట్టొద్దని సీఎం కేసీఆర్ ను ఓవైసీ ఆదేశించాడు అని అన్నారు. ఓల్డ్ సిటీలో నైట్ కర్ఫ్యూ అమలు కావటం లేదు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక్క వర్గం కోసమే పనిచేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిఖార్సైన హిందువునని చెప్పుకునే  కేసీఆర్ ఎందుకు మరో వర్గానికి మద్దతు ఇస్తున్నారు? అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: