ఒకప్పుడు దేశంలో రాహుల్ గాంధీని చాలా రకాలుగా విమర్శించేవారు. పప్పు అని కూడా సంభోదించేవారు. ఆయనకు ఏమీ తెలియదు అని బీజేపీ నేతలు గేలి చేసేవారు. నాడు జనాలు కూడా బీజేపీ వారు చేసే విమర్శలను ఎంజాయ్ చేసేవారు. అపుడు అంతా మోడీ మోజు అలా ఉండేది. మోడీ ఏం చెప్పినా తీయగా తోచేది. కానీ ఏడేళ్ళు గడిచేసరికి మాత్రం మోడీ మీద ఒక్కసారిగా వ్యతిరేకత పెల్లుబుకుతోంది.
ముఖ్యంగా గత ఏడాది నుంచి మోడీ మీద మొదలైన వ్యతిరేకత కాస్తా కరోనా రెండవ దశ నాటికి పీక్స్ కి చేరుకుంది. దానికి తోడు ఎన్నికల వేళ బీజేపీ ఇస్తున్న హామీలు, ఆర్భాటపు ప్రకటనలు ఆ తరువాత అమలు చేయకపోవడం వంటివి చూసిన వారికి మొహం మెత్తింది. ఇక దేశంలో పెరుగుతూ పోతున్న పెట్రోల్ ఇతర నిత్యావసరాల ధరలు కూడా మోడీ అంటే మండిపోయేలా చేశాయి. ఈ పరిణామాలతోనే బీజేపీకి అయిదు రాష్ట్రాల ఎన్నికలలో చేదు ఫలితాలు వచ్చాయని అంటారు.
ఇదే సమయంలో రెండవ దశ కరోనాను సరిగ్గా హ్యాండిల్ చేయలేదని కూడా మోడీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో మోడీ విధానాల మీద రాహుల్ గాంధీ పేల్చుతున్న వరస పంచ్ లకు ఇపుడు బాగా క్రేజ్ ఏర్పడింది. మోడీ ని ఢీ కొట్టే మొనగాడుగా రాహుల్ ని తాజాగా జనం చూస్తున్నారు. ఈ సమయంలోనే రాహుల్ దూకుడు పెంచాలని అంటున్నారు. రాహుల్ కనుక ఇదే తీరున దూసుకుపోతే ఏమో రేపటి రోజున దేశానికి ప్రధాని కావచ్చు అని అంటున్నారు. సో రాహు కాలం పోయింది రాహుల్ జీ అని అంతా అంటున్నారుట.