ఈటల రాజేందర్ బలం అంతా బీసీలలోనే ఉంది. ఆయన ఉద్యమ నాయకుడు. పైగా టీయారెస్ పునాదుల నుంచి వచ్చిన వాడు. ఇక ఈటల తనకు తానుగానే చెప్పినట్లుగా టీయారెస్ ఓనర్లలో ఆయన కూడా ఒకరు. సమర్ధుడైన నేత. ఓటమి లేకుండా ఆరు సార్లు గెలుస్తూ రెండు దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని కొనసాగించడం అంటే రికార్డే. ఇపుడు ఆయన మీద ఆరోపణలు వచ్చినట్లుగా టీయారెస్ నేతలు చెబుతున్నారు కానీ నిన్నటిదాకా మచ్చ లేని నేతగానే ఆయన ఉన్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఈటల కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. తెలంగాణా ఆత్మగౌరవమే నినాదంగా ఆయన పార్టీ ఉంటుందని చెబుతున్నారు. అపుడెపుడో నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీయార్ యావత్తు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఇపుడు అదే స్లోగన్ తెలంగాణాకు మార్చి కేసీయార్ ని ఢీ కొట్టాలని ఈటల గట్టిగా డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కేసీయార్ తనను బయటకు పంపేలా ఈటల పావులు కదుపుతున్నారు. దాని వల్ల జనంలో పెద్ద ఎత్తున సానుభూతి వస్తుందని కూడా ఆయన లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కేసీయార్ ని తాను ధీటుగా ఎదుర్కొంటాను అన్న ధీమా అయితే ఆయనలో ఉంది. మరి తెలంగాణాలో బీసీ నేతగా ఉన్న ఈటల ఏ విధంగా తమ యుద్ధాన్ని కొనసాగిస్తారో చూడాలి. మొత్తానికి ఈటల ఒక వ్యూహం ప్రకారమే సాగుతున్నారనుకోవాలి.