దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎక్కడచూసినా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఆక్సిజన్ అందక, బెడ్లు ఖాళీగా లేక వైద్య వసతులు కరువై ప్రజలు కరోనాతో పోరాడుతున్నారు. ఇటువంటి సమయంలో భారత్ కు మరో చిక్కు వచ్చి పడింది. ఇంకో ప్రమాదం ముసురుకుంది. తుఫాను రూపంలో ప్రకృతి దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్‌ ఇచ్చింది. మే 14 నాటికి అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. బలపడిన అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే ఛాన్స్‌ ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించింది.

ఈ తుఫాన్‌కు తౌక్టే అని పేరు పెట్టారు. ఒకవేళ ఇది భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది దేశంలో ఇదే మొదటి తుఫాన్ అవుతుందన్నారు. దీని ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఈ నెల 14 నుంచి సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో మాల్దీవులు, లక్షద్వీప్‌లలో గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే వారాంతంలో ఇక్కడి సముద్రంలో ఒక మీటరు ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్పా ఎవ్వరూ బయటకు రావొద్దని సూచించింది. తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: