భార‌త్‌లో కరోనా ఉద్ధృతి తగ్గుతున్నట్లే కన్పిస్తున్నా.. మరణాలు మాత్రం భారీ స్థాయిలో న‌మోద‌వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  బుధ‌వారం వెల్ల‌డైన హెల్త్ బులిటెన్‌లో కూడా మంగ‌ళ‌వారం రోజువారీ మరణాలు 4వేలు దాట‌డం భ‌యాందోళ‌న క‌లిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో 4205 మందిని వైరస్‌ బలితీసుకుంది. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క రోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. ఇక మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 2,54,197 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. వరుసగా మూడో రోజు రోజువారీ కేసులు 4 లక్షల దిగువనే ఉండటం మాత్రం ఆశాజ‌న‌క‌మైన విష‌య‌మ‌నే చెప్పాలి. అంతేగాక, కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ప‌రిస్థితి ఒక‌రకంగా మెరుగు ప‌డుతోంద‌న్న సానుకూల‌భావాన్ని క‌లిగిస్తోంది.


తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 19,83,804 మంది క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఇందులో 3,48,421 మందికి పాజిటివ్‌గా క‌న్ఫ‌ర్మ్ కాగా  మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.33కోట్లకు చేరింది. ఇదే సమయంలో 3,55,338 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 1.93కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 83.04శాతానికి పెరిగింది. ఇక వరుసగా రెండో రోజు యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 11వేలకు పైగా తగ్గాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,04,099 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటున్నారు. క్రియాశీల రేటు 15.87శాతంగా ఉండగా..మరణాల రేటు 1.09శాతంగా ఉంది.


కేంద్రం లాక్ డౌన్ ప్రకటించలేదు. కానీ మెజారిటీ రాష్ట్రాలు లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు దాదాపు దేశమంతా లాక్ డౌన్ మాదిరిగా కనిపిస్తోంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రం కర్ణాటక కరోనా కేసుల్లో మహారాష్ట్రను మించిపోయింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తోంది. పాజిటీవ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా.. ఏ మాత్రం ఫలితం కనిపించడంలేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: