ఈద్ సమయంలో ముస్లిం సోదరులంతా మసీదుల్లో జరిగే ఈద్ ప్రార్థనలకు హాజరవుతారు. కొత్త బట్టలు ధరించి మసీద్కు వెళతారు. ఇది వారి సంప్రదాయం. అంతేకాకుండా ఖర్జూరం వంటి ఏదైనా తీపిని తిని ఆ తర్వాత తిక్బర్ అనే ఓ చిన్న ప్రార్థన చేస్తారు. ఈ ఈద్ ప్రార్థనలు ప్రారంభం కావడానికి ముందు జకాత్ అల్ ఫితర్ పేరుతో పేదవారికి దానధర్మాలు చేస్తారు. అంతేకాకుండా నేడు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా తమకు ఆప్తులైన వారితో కలిసి ఇఫ్తార్ విందు చేస్తారు. అందుకోసమనే అనేక దేశాల్లో ఈ పర్వదినాన సెలవు ప్రకటిస్తారు.
ఇదిలా ఉంటే ఈ మాసంలో ఉపవాసం అందరూ ఉండరు. కేవలం ఆరోగ్యవంతులు మాత్రమే ఈ దీక్షను చేస్తారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, ప్రయాణాలు చేసేవారు ఈ దీక్ష చేయరు. ఈ దీక్షా సమయంలో సూర్యోదయం కన్నా ముందే భోజనం ముగిస్తారు. దీనినే సుహుర్ లేదా సెహ్రి అంటారు. అదే విధంగా సూర్యాస్తమయం తరువాత ఉపవాసం ముగిస్తారు. సూర్యాస్తమయం తరువాత చేసే భోజనాన్ని ఇఫ్తార్ లేదా ఫితూర్ అంటారు. ఈ సమయంలో ముస్లింలు దాన ధర్మాలు చేసేందుకు దైవంతో తమ అనుబంధాన్ని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తారు.
అందులో భాగంగా ప్రతి రోజు నమాజ్ తప్పక చేస్తారు. అయితే పండుగకు 2 రోజుల ముందుగ జాగారం చేస్తారు. అందుకోసం ప్రతి మసీద్లో రాత్రి పూట తరావీహ్ ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనలకు కూడా కొందరు హాజరవుతారు. ఈ ప్రార్థనలు కేవలం రంజాన్ మాసంలోనే జరుగుతాయి. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి వచ్చాక రంజాన్ రావడం ఇది రెండో సారి. ఈసారి కూడా ముస్లిం సోదరులు తమ సాంప్రదాయానికి విభిన్నంగా ఈ పండుగను జరుపుకోవాల్సి ఉంది.