వివరాలిలా ఉన్నాయి.. ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్డులోని ఆదిత్య జనరల్ ఆసుపత్రిలో కరోనా చికిత్సకు భారీగా బిల్లులు వేస్తున్నారని.. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లకు వేల రూపాయలలో వసూలు చేస్తున్నారని కొందరు సామాన్య ప్రజలు టాస్క్ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆసుపత్రికి వెళ్లి అధిక ధరలపై కదం తొక్కాలని టాస్క్ఫోర్స్ అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు స్థానిక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి తో కలసి ఆస్పత్రిపై రైడ్ చేశారు.
అనంతరం ఒంగోలు జిల్లా వాసులైన ఏడుగురు కరోనా రోగులు ఆదిత్య జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. అయితే అధిక బిల్లులపై విచారణ చేయగా.. అసలు ఈ ఆసుపత్రికి కొవిడ్ చికిత్స చేసే అనుమతులే లేవని తేలింది. మరొక విస్తుపోయే నిజమేమిటంటే.. ఈ ఆసుపత్రిలో అర్హులైన వైద్యులే లేరట. అయితే అర్హత లేని వైద్యులతో ఏకంగా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఈ ఆస్పత్రి యజమాని ఆవుల శ్రీనివాసరెడ్డి కూడా ఓ నకిలీ వైద్యుడే అని తెలిసి అధికారులు అవాక్కయ్యారు.
కనిగిరి మండలం చినఇర్లపాడు గ్రామ నివాసి అయిన శ్రీనివాసరెడ్డి ఆదిత్య జనరల్ ఆసుపత్రి నడుపుతూ దాదాపు అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నాడు. కానీ ఈయన బీఫార్మసీ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేశాడట. ఐతే ఆసుపత్రి ప్రారంభమైన రోజుల్లో అర్హత కలిగిన వైద్యులు పని చేశారు కానీ వారు ఈ ఆస్పత్రిలో చికిత్స అందించడం మానేసిన అనంతరం శ్రీనివాసరెడ్డే చికిత్స అందించడం ప్రారంభించారు.