మీ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడుంది ఎవరనుకుంటున్నార్రా? స్టాలిన్.. ముఖ్యమంత్రి స్టాలిన్. జాగ్రత్త.. ఏమనుకుంటున్నారో.. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే.. కరోనాను జయించడానికి పోరాటం చేస్తోంటే.. మీరు నల్లబజారులో 10 రెట్లుఎక్కువ ధరకు మందులు అమ్ముతారా? ఏమనుకుంటున్నార్రా.. కొవాగ్జిన్ టీకా.. రెమ్డెసివర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ అంటూ దేన్నీ వదిలిపెట్టడంలేదుగా.. అందుకే మీ అందరినీ శ్రీకృష్ణజన్మస్థానానికి పంపుతున్నా... అంటూ స్టాలిన్ను తమిళనాడు కథానాయకుడిగా అక్కడి ప్రజలు వ్యవహరించుకుంటున్నారు.. పై రీతిలో ముచ్చటించుకుంటున్నారు.
లాక్డౌన్ కు జై కొట్టిన ప్రజలు
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే స్టాలిన్ ఒక్క నిముషం కూడా ఆలస్యం చేయకుండా రాష్ట్రమంతా లాక్డౌన్ ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్రానికి కావల్సింది లెక్కలు వేసుకునే లాభాలు కాదని, ప్రజల ప్రాణాలు ముఖ్యమంటూ ప్రకటన చేశారు. దీంతో తమిళ తంబీలంతా ముగ్ధులైపోయారు. లాక్డౌన్కు జై కొట్టారు. అందరూ స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత పూర్తిస్థాయి రంగంలోకి దిగితే బ్లాక్మార్కెట్ దందాను పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే ఎవరైతే అత్యవసరమైన కరోనా మందులను నల్లబజారులో విక్రయిస్తుంటే వారందరిపై గూండా చట్టం కింద కేసు నమోదుచేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించమని ఆదేశాలు జారీచేశారు. ఈ చట్టంకింద అరెస్ట్ అయితే బెయిల్ కూడా దొరకదనే విషయం తెలుసుకోకుండా అక్రమార్కులు నల్లబజారులో విక్రయాలకు పాల్పడుతున్నారు.
ముఖ్యమంత్రి పనితీరుకు ముగ్దులైన పోలీసులు
ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని, ఎటువంటి రాజకీయ రికమండేషన్లు చేసినా, నాకు వాళ్లు తెలుసు.. వీళ్లు తెలుసు.. అంటే అసలు వదిలిపెట్టవద్దని కఠినమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరు చూసి పోలీసులు ముగ్ధులైపోతున్నారు. వెంటనే అక్రమార్కుల భరతం పట్టడానికి రాష్ట్రమంతా జల్లెడ పడుతున్నారు. అక్రమార్కుల గుండెల్లో పోలీసుల బూట్ల చప్పుళ్లు మార్మోగుతున్నాయి. . దీంతో ఒక్కదెబ్బకు కరోనాకు కావల్సిన మందులన్నీ చక్కగా ఔషధ దుకాణాల్లో లభ్యమవుతున్నాయి. పార్టీలతో, నేతలతో సంబంధంలేకుండా రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి.. ప్రజలంతా బాగుండాలనే తమిళనాడు రాజకీయ నేతల ఆలోచనా వైఖరినే స్టాలిన్ కూడా కొనసాగిస్తున్నారు.