లాక్ డౌన్ కావడంతో ఆటో డ్రైవర్లు ప్రయాణికుల దగ్గర చార్జీల దోపిడీ చేస్తున్నారు.ఆటో డ్రైవర్లు 1000/- కి తగ్గకుండా చార్జీలు డిమాండ్ చేస్తున్నారు.ఒక ఆటో డ్రైవర్ అయితే ఒక వ్యక్తికి చుక్కలు చూపించాడు. కేవలం సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీకి 1000/- డిమాండ్ చేశాడు.గత్యంతరం లేని పరిస్థితుల్లో.. ఆటోడ్రైవర్ అడిగిన రూ.1000 ఇవ్వాల్సివచ్చింది.కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఉదయం 10 గంటల్లోపు నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లాలన్నా, ఇతర ఊళ్లకు పోవాలన్నా లేదా ఇతర ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సులు, విమానాల్లో నగరానికి చేరుకున్నవాళ్లు గమ్యస్థానాలకు వెళ్లాలన్నా వందల్లో చార్జీలు సమర్పించుకోవాల్సి వస్తోంది.
సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి క్యాబ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం లాక్డౌన్ విధించడంతో వీటి సంఖ్య మరింత తగ్గింది. గతంలో సుమారు 60 వేల క్యాబ్లు అందుబాటులో ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 10 వేల కంటే తక్కువకు పడిపోయింది. దీంతో ప్రయాణికుల అవసరాలకు సరిపడా క్యాబ్లు అందుబాటులో ఉండడం లేదు. క్యాబ్ బుక్ చేసుకొనేందుకు 45 నిమిషాల నుంచి గంట వరకు వేచి ఉండాల్సి వస్తోంది. చివరకు బుక్ అయినా పెద్ద మొత్తంలో చార్జీలు చెల్లించాల్సివస్తోంది. సాధారణ రోజుల్లో ఎయిర్పోర్టు నుంచి తిరుమలగిరికి వెళ్లేందుకు రూ.800 వరకు క్యాబ్ చార్జీలు ఉంటే ఇప్పుడు రూ.1500 వసూలు చేస్తున్నారు.
మహాత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి అంబర్పేట్కు ఆటోలో వచ్చేందుకు రూ.200 తీసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో రూ.50 కంటే ఎక్కువ ఉండదు. ఇది లాక్డౌన్కు ముందు ఉన్న చార్జీ. లాక్డౌన్ మొదలైన తర్వాత ఆటో ఎక్కాలంటే కనీసం రూ.500 జేబులో ఉంచుకోవాల్సిందే. సిటీ బస్సులు సరిపడా లేకపోవడం కూడా కారణమే. ఇలాంటి ఆపత్కాలంలో కూడా ప్రజల అవసరాలను సొమ్ము చేసుకోవడం చాలా దారుణమని హైదరాబాద్ లో నివసిస్తున్న వారు వాపోతున్నారు.